సుల్తానా అమీనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 6 మంది మృతి

- October 25, 2016 , by Maagulf
సుల్తానా అమీనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 6 మంది మృతి

మలేసియాలోని సుల్తానా అమీనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు పేషెంట్లు మరణించారు. వారిలో ముగ్గురు భారత సంతతికి చెందిన మలేసియన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రి రెండో ఫ్లోర్‌లోని సదరన్ ఐసీయూలో మొత్తం ఏడుగురు పేషెంట్లుండగా, వారిలో ఆరుగురు మరణించినట్లు ఆస్పత్రి డైరెక్టర్ ఆత్మన్ అబ్దుల్లా తెలిపారు. మిగిలిన ఒకరిని అగ్నిమాపక దళం రక్షించిందన్నారు. ఐసీయూలో ఉన్న ఏడుగురూ వెంటిలేటర్ మీదే ఉన్నారు. అందువల్ల వాళ్లను కదిలించడం సాధ్యం కాలేదని ఆయన వివరించారు. అగ్నిప్రమాదం విషయం తెలియగానే పది ట్రక్కులు, 166 మంది అగ్నిమాపక సిబ్బందిని అక్కడకు తరలించామన్నారు.మంటలు ఆస్పత్రిలోని ఇతర విభాగాలకు వ్యాపించలేదని ఆయన తెలిపారు.
ఉదయం 11.15 గంటల సమయంలో (మలేసియా కాలమానం ప్రకారం) ఐదు మృతదేహాలు కనిపించాయని, ఆరోది కాసేపటి తర్వాత కనిపించిందని జొహార్‌బహ్రూ పోలీసు చీఫ్ సులేమాన్ సలే చెప్పారు. అనధికారిక సమాచారం విని ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ఆస్పత్రిలో తాను ఉన్నంతసేపు అగ్నిప్రమాదం గురించి తెలియలేదని, బయటకు వచ్చాకే తెలిసిందని ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హబీబా అబ్ద్ ధనీ (37) అనే మహిళ చెప్పారు. తన తండ్రికి పక్కటెముకల్లో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చామని, ఆయనతోపాటు తాను నాలుగో అంతస్థులో ఉన్నానని ఆమె తెలిపారు. కాసేపటికి ఒక నర్సు వచ్చి అందరినీ వార్డు నుంచి బయటకు వెళ్లమని చెప్పిందని.. కిందకు వెళ్లడానికి ఆస్పత్రి సిబ్బంది సాయం చేశారని చెప్పారు. ప్రమాదం జరిగే సమయానికి ఆస్పత్రిలో 294 మంది పేషెంట్లు, 193 మంది సిబ్బంది ఉన్నారని సులేమాన్ వివరించారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com