కొత్త రికార్డు సృష్టించనున్న ఇస్రో

- October 28, 2016 , by Maagulf
కొత్త రికార్డు సృష్టించనున్న ఇస్రో

అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని చేరేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఒకే రాకెట్‌ ప్రయోగం ద్వారా 83 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సాధించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 81 ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి కాగా, 2 భారత్‌వని ఇస్రో అధికారులు తెలిపారు.
2017 తొలి త్రైమాసికంలో ఈ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతున్నట్లు యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ సీఎండీ రాకేశ్‌ శశిభూషణ్‌ తెలిపారు. ఇస్రోకు యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది. ఒకే రాకెట్‌లో 83 ఉపగ్రహాలను పంపిస్తున్నామని.. వీటిలో ఇతర దేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయని శశిభూషణ్‌ వెల్లడించారు.
ఒకే కక్ష్యలోకి 83 ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అన్ని ఉపగ్రహాలను వదిలేంత వరకూ రాకెట్‌ను అదే కక్ష్యలో ఉంచడం ఈ ప్రతిపాదిత మిషన్‌లోని అతి పెద్ద సవాల్‌ అని ఆయన పేర్కొన్నారు. ఈ రికార్డు ప్రయోగానికి ఇస్రో తనకు అచ్చొచ్చే పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్‌ రకం రాకెట్‌ను ఉపయోగించనున్నట్లు చెప్పారు. మొత్తం 1,600 కేజీల బరువును ఇది మోసుకెళ్లగలదని తెలిపారు.
ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడం ఇస్రోకి ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com