సౌదీలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్న మహిళలు

- August 23, 2015 , by Maagulf
సౌదీలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్న మహిళలు

సౌదీ అరేబియాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు వేసే హక్కు లభించబోతోంది. డిసెంబర్ 12న జరగబోయే ఈ ఎన్నికల కోసం 21 రోజుల పాటు నిర్వహించనున్న ఓటర్ల నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభమయింది. అయితే పుణ్యక్షేత్రాలయిన మక్కా, మదీనాలో మాత్రం ఈ ప్రక్రియ వారం రోజుల క్రితమే ప్రారంభమయింది. ప్రజా ప్రాతినిధ్య ఆధారిత సమాజం దిశగా ఇదొక మైలురాయి అని సౌదీ అరేబియా అధికారులు అభివర్ణిస్తున్నారు. మ క్కా, మదీనా నగరాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల నమోదు ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమవుతుంది. ఈ రెండు నగరాల్లో మాత్రం ఈ రోజు ప్రారంభమయింది. గత ఆదివారం సఫినాజ్ అబూ అల్ షమత్, జమాత్ అల్- సాదీలు ఓటు వేయడం కోసం నమోదు చేసుకున్న తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో పాల్గొనడం మహిళలకు ఒక జాతీయ కర్తవ్యం అని ఈ సందర్భంగా షమత్ వ్యాఖ్యానించింది. సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1,253 ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, వాటిలో పురుషులకోసం 839, మహిళలకోసం 424 కేంద్రాలను కేటాయించనున్నట్లు మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిందని సౌదీ గజెట్ తెలియజేసింది. మహిళలకు ఎన్నికల్లో పాల్గొనేందుకు కొంతమేర అవకాశం కల్పిస్తూ ఇటీవల మరణించిన సౌదీ రాజు అబ్దుల్లా 2011లో కొత్తగా జారీ చేసిన విధానం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో మహిళలు లేదా పురుషులు ఎవరు కూడా తమ ఫోటోలను ఉపయోగించకూడదు. అంతేకాకుండా మహిళలకు, పురుషులకు విడివిడిగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలని మహిళా హక్కుల ఉద్యమకారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com