ఫిల్మ్ ఫెస్టివల్లో మనం 9వ స్థానంలో ఉన్నాం
- November 01, 2016
మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాలు ప్రదర్శితమయ్యేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఎంపికైెెతే భారీ మొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. మన దగ్గర ఆ ధోరణి లేదు. అలాంటి ప్రోత్సాహం అందితే మన దగ్గర కూడా మంచి సినిమాలొస్తాయ'ని అంటున్నారు నిర్మాత సి.వి.రెడ్డి. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ మనోరమా సెక్షన్కు జ్యూరీ సభ్యులుగా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, 'ఇండియన్ పనోరమా జ్యూరీ సభ్యుడిగా రెండవ సారి పనిచేస్తున్నాను. ఈ నెల 20 నుంచి 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గోవాలో ప్రారంభం కానుంది.21న ఇండియన్ పనోరమా విభాగంలో జ్యూరీ ఎంపిక చేసిన 25 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. అయితే ఈసారి వేడుకల్లో కొన్ని మార్పులు జరిగాయి.. కొత్త దర్శకులు తీసిన సినిమా ఎంపికైతే దర్శకుడికి 10 లక్షల నగదు బహుమతిని కేంద్రప్రభుత్వం అందజేస్తుంది. ఈ నగదు బహుమతిని మొదటి రోజే అందజేస్తారు. ప్రతిసారి గత ఏడాది సెప్టెంబర్1 నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 31 వరకు విడుదలైన సినిమాలను ఇండియన్ పనోరమా విభాగంలో ఎంట్రీ కోసం పంపిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కాకుండా ఉన్న సినిమాలను కూడా అక్టోబర్ 31 వరకు పంపించుకునే వెసులుబాటు కల్పించారు. అలా ఈసారి రెండు సినిమాలకు అవకాశం కల్పించాం. దీంతోపాటు జ్యూరీలో కూడా కొన్ని మార్పులు చేశారు. గతంలో పది మంది జ్యూరీ సభ్యులుంటే ఈసారి 13కి పెంచారు. 12 మంది సభ్యులకు ఒక చైర్మెన్ ఉంటారు. 12 మంది నాలుగు విభాగాలుగా విడిపోయి ఎంట్రీకొచ్చిన సినిమాల్లో 1/3 చొప్పున సినిమాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా జ్యూరీ 20 సినిమాలను ఎంపిక చేస్తే, మిగిలిన 5 సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెడరేషన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది మొత్తం 230 సినిమాలు ఇండియన్ మనోరమా విభాగంలో స్క్రీనింగ్కి రాగా అందులో 25 సినిమాలను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈసారి ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు కేవలం మూడు సినిమాలు మాత్రమే ('బాజీరావు మస్తానీ', 'సుల్తాన్', 'ఎయిర్లిఫ్ట్') పంపించారు. మిగిలిన 22 సినిమాలను జ్యూరీ ఎంపిక చేసింది. కొత్తగా సంస్కృతం భాషా చిత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ భాష నుంచి 'ఇస్తి' సినిమాను ఎంపిక చేశారు. 9వ స్థానంలో తెలుగు సినీ పరిశ్రమ.. ప్రతి ఏడాది అత్యధిక సినిమాలు నిర్మించే ఇండిస్టీగా తెలుగు చిత్ర పరిశ్రమ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మాత్రం చాలా వెనకబడి ఉంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మనం 9వ స్థానంలో ఉన్నాం. ఈ సారి ఆరు తెలుగు సినిమాలు 'మనమంతా', 'నేను శైలజ', 'కంచె', 'పెళ్ళిచూపులు', 'షాను' ఎంట్రీకి వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా ఎంపిక కాలేదు. లిపి లేని పది సినిమాలు ఎంపిక కావడం విశేషం. మన సినిమాలు పెద్ద సంఖ్యలో రాకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్పై మన దర్శకనిర్మాతలకు అవగాహన లేకపోవడమే. ఇలాంటివి జరుగుతాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతేకాదు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా లేదు. గతంలో సినిమాలకు సబ్సిడీలు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేదు. అదే మహారాష్ట్ర ప్రభుత్వం వారి చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఎంపికైతే ఒక్కో సినిమాకు రూ.50లక్షలు, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు 20 లక్షల రూపాయలు ఇస్తున్నాయి. మనవాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రణాళిక చేసి, ఎవరికి వాళ్ళు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తే మున్ముందు మనం కూడా ముందంజలో ఉంటాం' అని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









