ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం...

- December 28, 2016 , by Maagulf
ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం...

తాలిబన్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఒంటరిగా బయటకెళ్లిందన్న కారణంతో ఓ మహిళ(30)ను తాలిబన్లు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏకంగా తల నుంచి మొండాన్ని వేరు చేసి తమ కర్కషత్వాన్ని బయటపెట్టుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని సర్‌-ఇ-పుల్‌ రాష్ట్రంలో ఉన్న లట్టి అనే మారుమూల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ గ్రామం చాన్నాళ్లుగా తాలిబన్ల అదుపులోనే ఉంది. గ్రామంలోని ప్రతీ కదలిక వీరిపై నిఘా ఉంటుంది.
ఈ నేపథ్యంలో పలు వస్తువులు కొనుగోలు చేయడానికి ఓ మహిళ గ్రామం నుంచి పట్టణానికి వెళ్లింది. అయితే తిరిగొచ్చే క్రమంలో ఆమె ఒంటరిగా బయటకు వెళ్లిందన్న విషయాన్ని తాలిబన్లు గుర్తించారు.ఆ వెంటనే ఆమెపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
దీనిపై అక్కడి గవర్నర్ స్పందించారు. మృతురాలి భర్త ఇరాన్ లో ఉంటాడని, అందువల్లే ఆమె ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, తాలిబన్ల నిబంధన ప్రకారం.. మహిళలెవరూ ఒంటరిగా బయటకు రాకూడదు. భర్త లేకపోతే దగ్గరి బంధువునైనా వెంట తీసుకెళ్లాలి.
అంతేకాదు, మహిళలకు విద్య నిషిద్దం. బురఖా ధరించడం తప్పనిసరి వంటి నిబంధనలను ఆచరించి తీరాల్సిందేనని తాలిబన్లు అక్కడి ప్రజలను ఆదేశిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు ఐదుగురు అమ్మాయిలను తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారు. కేవలం ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నారన్న కారణంగా తాలిబన్లు వారిని కాల్చి చంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com