భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా?

- January 20, 2017 , by Maagulf
భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా?

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా? తమకు చెందాల్సిన ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ అమెరికన్‌ కాంగ్రెస్‌లో హెచ్‌-1బీ వీసాపై నిబంధనలను కఠినతరం చేసేలా అక్కడి సెనేటర్లు కీలక బిల్లులను తీసుకొస్తున్నారు. తాజాగా రానున్న మరో బిల్లు సైతం భారత ఐటీ వర్గాలకు చేదు గుళికలాంటిదే. ఇది ఆమోదం పొందితే విదేశీయులైనా.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికే ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సెనేటర్లు చుక్‌ గ్రాసెల్లే, డిక్‌ డర్బన్‌లు ఇందుకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌లో ప్రతిపాదించారు.

దీని ప్రకారం తొలిసారి హెచ్‌-1బీ వీసా వార్షిక కేటాయింపులను అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల ప్రాధాన్యం ఆధారంగా కేటాయిస్తారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన ఉత్తమ, అత్యుత్తమ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని సెనేటర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉన్నత విద్య పట్టభద్రులై అధిక వేతనం పొందుతున్నవారు, నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన వాళ్లకు సైతం అవకాశం కల్పించనున్నారు.
'అమెరికా పరిశ్రమల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంచుకునేందుకు కాంగ్రెస్‌ ఈ కార్యక్రమాన్ని సృష్టించింది. అంతేకానీ వేరొకరితో ఆ స్థానాలను భర్తీ చేయడానికి కాదు. దురదృష్టవశాత్తూ కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇక్కడి వారిని ఉద్యోగాల నుంచి తప్పించి ఇతర దేశాల నుంచి వచ్చి తక్కువ వేతనానికి పనిచేసే శ్రామికులను నియమించుకుంటున్నాయి' అని గ్రాసెల్లే అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com