టీమిండియా 'చెత్త' రికార్డు!

- February 24, 2017 , by Maagulf
టీమిండియా 'చెత్త' రికార్డు!

పుణె: టెస్టుల్లో తిరుగులేని విజయాలతో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు.. తాజాగా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు.. చివరి ఏడు వికెట్లను కోల్పోయే క్రమంలో ఓ అప్రథను సొంతం చేసుకుంది. భారత జట్టు ఆఖరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఇది భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది. అంతకుముందు భారత్ తన ఆఖరి ఏడు వికెట్లను కోల్పోయే క్రమంలో 18 పరుగులు చేసింది. గతంలో 1989-90 లో క్రిస్ చర్చ్ లో ఈ పేలవమైన రికార్డును భారత్ మూటగట్టుకోగా.. దాదాపు 27 ఏళ్ల తరువాత ఆ చెత్త రికార్డును సవరించింది.

ఈ రోజు ఆటలో 94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లనుకోల్పోయింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టు.. టీ విరామానికి ముందుగానే ఆలౌటైంది. ఈ రోజు ఆటలో 40.1 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 105 పరుగులకే చాప చుట్టేసింది. ప్రధానంగా లంచ్ తరువాత ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి భారత్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. ఇక ఆపై తేరుకోలేని భారత్ మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫీ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com