భారతీయులకు వీసా కష్టాలు అమెరికాలో
- March 08, 2017
అమెరికాలో భారతీయులకు షాక్ మీద షాక్ తగలుతోంది. ట్రంప్ జమానా మొదలైన తర్వాత వీసా కష్టాలు ఎక్కువయ్యాయి. H1B వీసాలపై ఆంక్షలు మాత్రమే కాదు, ఇప్పుడు H4 వీసాపై ఉద్యోగాలు చేసే వారికీ కష్టాలు తప్పేలా లేవు. సాధారణంగా ఈ వీసా పొందిన వారంతా H1B వీసా పొందిన వారి భార్యలే. వీరు ఉద్యోగం చేయడంపైనా 60 రోజుల పాటు నిషేధం విధించాలంటూ వాషింగ్టన్ డీసీ అప్పీల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనను కోర్టు అంగీకరిస్తే ఇక భారతీయ మహిళలకూ కష్టాలు తప్పవు.
అమెరికాలో H1B వీసాతో పనిచేస్తున్న వారి భార్యలు H4 వీసాపై అక్కడికి వెళ్లారు. అర్హత గల ఇలాంటి వారికి పనిచేసే హక్కును కల్పించాలనే చిరకాల డిమాండ్ ను గతంలో ఒబామా ప్రభుత్వం ఆమోదించింది. 2015 ఫిబ్రవరిలో ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అర్హత గలవారు ఉద్యోగాలు చేయవచ్చంటూ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వేలాది మంది భారతీయ మహిళలు పనిచేసే అవకాశం వచ్చింది. సేవ్ జాబ్స్ USA అనే సంస్థ ఈ ఉత్తర్వులను వ్యతిరేకించింది. జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సంస్థ అభ్యంతరాన్ని కోర్టు తిరస్కరించింది.
ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అదే సంస్థ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఈసారి మాత్రం ఆ సంస్థ వాదనకు అనుకూలంగా తీర్పు రావచ్చని అమెరికాలోని ప్రవాసులు భయపడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. అమెరికా ప్రస్తుత అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ గతంలో సెనేటర్ గా పనిచేశారు. H4 వీసా ఉన్నవారు ఉద్యోగాలు చేయవచ్చనే ఉత్తర్వుల వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతారని గతంలో వ్యాఖ్యానించారు. అయితే గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన రూలింగ్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని ఇమ్మిగ్రేషన్ వాయిస్ అనే సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ అన్నారు. అత్యున్నత అర్హతలు గల మహిళలు అమెరికాలో పనిచేయడం ద్వారా ఆ దేశానికి అదనపు ఆదాయాన్ని, కొత్త ఉద్యోగాలను సృష్టించారనేది ఈ సంస్థ వాదన.
ఒకవేళ H4 వీసా గల వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే వేలాది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాదు, స్టార్టప్ కంపెనీలను స్థాపించే ప్రయత్నంలో ఉన్న చాలా మంది కలలు కల్లలవుతాయి. సుదర్శనా సేన్ గుప్తా చాలా కాలంగా అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. క్యాన్సర్ ఇమ్యునో థెరపీ స్ట్రాటజీస్ పై ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక తాను ఈ పనిచేయలేనా అని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాళ్లు చాలా మందికి ఇప్పుడు కంటిమీద కునుకు లేదు. ట్రంప్ రాజ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వారి జీవితంలో భాగమైంది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







