రద్దయిన నోట్ల డిపాజిట్ రూ.2 లక్షలు దాటితే కచ్చితంగా ఐటీ రిటర్న్

- March 31, 2017 , by Maagulf
రద్దయిన నోట్ల డిపాజిట్ రూ.2 లక్షలు దాటితే కచ్చితంగా ఐటీ రిటర్న్

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు రూ.2 లక్షలకు మించి బ్యాంకుల్లో జమ చేసిన వారు విధిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని శుక్రవారం వెల్లడించింది. గతంలో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, దాని గురించి ఆదాయపన్ను శాఖ ఎలాంటి విచారణ నిర్వహించదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. రూ.2 లక్షలకు మించి బ్యాంకుల్లో జమ చేసి ఉంటే ఆ మొత్తం వివరాలు ఇప్పుడు తప్పనిసరిగా వెల్లడించాల్సిందే.

2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఒక పేజీ ఐటీ రిటర్న్ ఫామ్‌ కింది భాగంలో దీని కోసం ఒక కాలమ్ కేటాయించారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో జమ చేసిన రద్దయిన పాత నోట్లు రూ.2 లక్షలకు మించిన వివరాలు ఇందులో పొందుపరచాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇలా మాటమార్చడంతో ఇప్పుడు ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకునేందుకు కొంతమంది తమ ఖాతాల ద్వారా ఇతరులకు సహకరించారు కూడా. ఇప్పుడు రూ.2 లక్షలకు మించి జమచేసి ఉంటే లెక్క చెప్పాల్సిందేనని కేంద్రం ప్రకటించడంతో వీరి గుండెల్లో రాయి పడినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com