సోమాలియాలోని సైనిక స్థావరంపై దాడి, 70 మంది మృతి

- June 08, 2017 , by Maagulf
సోమాలియాలోని సైనిక స్థావరంపై దాడి, 70 మంది మృతి

 సోమాలియాలోని సగం స్వయంప్రతిపత్తి కలిగిన పున్‌ట్లాండ్ సైనిక స్థావరంపై అల్-షబాబ్ తీవ్రవాద సంస్థ భారీ దాడికి తెగబడింది. ఈ దాడిలో దాదాపు 70 మంది మృతిచెందారని అధికారులు గురువారం తెలిపారు. దీన్ని ఈ ఏడాదిలోనే అతి దారుణమైన దాడిగా పేర్కొన్నారు. బొస్సాసోలోని వాణిజ్యహబ్ నుంచి పడమర దిక్కున వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అఫ్ ఉరుర్ శిబిరంపై తొలుత రిమోట్‌తో పేలుళ్లకు పాల్పడ్డారు. అంతకుముందే తీవ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి అత్యంత సమీపం నుంచి సైనికుల మీద కాల్పులు జరిపి చంపేసినట్టు సీనియర్ సైనికాధికారి అహ్మద్ మహ్మద్ తెలిపారు. ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్టు తెలిసిందని, మృతుల మొత్తం సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదని చెప్పారు. ఓ మహిళ సహా పలువురు పౌరుల తలలను తీవ్రవాదులు నరికేశారని ప్రత్యక్షసాక్షి అబ్దిబాసిత్ హస్సన్ తెలిపారు. తీవ్రవాదులతోపాటు మానవబాంబుల రూపంలో మూడుదిక్కుల నుంచి సైనిక స్థావరంపై దాడులు చేశారు. 
-పౌరుల తల నరికేశారు.. సోమాలియాలో దారుణం
-దాడి తమ పనేనని ప్రకటించిన అల్-షబాబ్ 
అక్కడున్న సైనికులతోపాటు అప్పటికే అక్కడకు చేరుకున్న అదనపు బలగాలు ఎదురుదాడులకు దిగడంతో తీవ్రవాదులు శిబిరం నుంచి బయటకు వెళ్లిపోయారని సీనియర్ సైనికాధికారి కల్నల్ హషి అహ్మద్ తెలిపారు. ఈ దాడిలో దాదాపు వందమంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దాడికి పాల్పడింది తామేనని, ఇందులో 61 మంది సైనికులు మృతిచెందారని షహాదా అనే వార్తా సంస్థ ద్వారా అల్-షబాబ్ ప్రకటించినట్టు సైట్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. అదేవిధంగా పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు అల్‌షాబాబ్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com