భారతదేశపు 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్

- July 20, 2017 , by Maagulf
భారతదేశపు 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్

భారత 14 వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. ఆసక్తికరంగా జరిగిన ఎన్నికల్లో చివరికి ఎన్డీయే అభ్యర్థినే విజయం వరించింది. ఎలక్టోరల్‌ కాలేజీలోని మొత్తం 10 లక్షల 69 వేల 358 విలువైన ఓట్లలో రామ్‌నాథ్‌కు 7 లక్షల 2 వేల 044 విలువైన ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 65.6 శాతం. ఆయన ప్రత్యర్థి మీరాకుమార్‌... 34.35 శాతంతో  3 లక్షల 67 వేల 314 విలువైన ఓట్లు సాధించారు. రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా సాగుతుందని మొదట అందరూ భావించారు. న్యాయశాస్త్ర కోవిదుడైన కోవింద్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేయగా.. ఆయనకు పోటీగా... మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను యూపీఏ బరిలో నిలిపింది. హేమాహేమీల మధ్య పోటీ కావడంతో... రసవత్తర పోరు ఖాయమన్న వాదనలు వినిపించాయి. అయితే చివరికి... కోవింద్‌ విజయం నల్లేరుపై నడకగానే సాగింది. పలు రాష్ట్రాల్లో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరగడం వల్లే  కోవింద్‌ విజయం సాధ్యమైందని తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. గుజరాత్‌లో 8 మంది కాంగ్రెస్‌ సభ్యులు కోవింద్‌కు ఓటు వేసినట్లు తేలింది. ఇక మొత్తం 771 మంది ఎంపీల్లో... 521 మంది కోవింద్‌ పక్షాన నిలవగా... 24 ఓట్లు చెల్లకుండా పోయాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయంతో  ఎన్డీయే శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com