మా గస్తీ కొనసాగుతుంది అంటున్న చైనా

- August 28, 2017 , by Maagulf
మా గస్తీ కొనసాగుతుంది అంటున్న చైనా

న్యూదిల్లీ: గత కొన్ని నెలలుగా సాగుతున్న డోక్లామ్‌ వివాదానికి తెరపడిందనుకున్న సమయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భారత్‌- చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా రెండు దేశాల తమ బలగాలను డోక్లామ్‌ నుంచి ఉపహరించుకోవడానికి అంగీకరించాయని భారత్‌ తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై చైనా భిన్నంగా స్పందించింది. భారత సైనికులు మాత్రమే అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఇందుకు భారత్‌ అంగీకరించిందని తెలిపింది. తమ సైనికుల గస్తీ మాత్రం ఆ ప్రాంతంలో కొనసాగుతుందని పేర్కొంది.

ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ డోక్లామ్‌ నుంచి భారత సైనికులు, వారి సామగ్రిని తరలించారని తెలిపారు. వారు వెనక్కు వెళ్లారని చెప్పారు. చైనా భద్రతా దళాలు మాత్రం ఆ ప్రాంతంలో గస్తీ కొనసాగిస్తాయని పేర్కొన్నారు.
భూటాన్‌కు చెందిన డోక్లామ్‌లో చైనా నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత సైనికులు అడ్డుకున్నారు. దీంతో జూన్‌లో రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమైంది. భారత సైనిక బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చైనా పదే పదే సూచించింది. యుద్ధం తప్పందంటూ హెచ్చరించింది. కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఎంతమాత్రం వెనక్కి తగ్గని భారత్‌ చైనాకు ధీటుగానే సమాధానమిస్తూ వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com