మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రాన్నున్న ప్రధాని నరేంద్ర మోడీ

- October 13, 2017 , by Maagulf
మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రాన్నున్న ప్రధాని నరేంద్ర మోడీ

హైదరాబాద్‌లో మెట్రో పరుగులకు మరెంతో దూరం లేదు.. మెట్టుగూడ-బేగంపేట మార్గంలో రెండ్రోజులుగా టెస్ట్‌ రన్‌ కూడా జరుగుతోంది. పూర్తి స్థాయి ట్రయల్స్‌కూ రంగం సిద్ధమైంది. అటు.. మెట్రో రైలు నిర్మాణం స్థితిగతులపై పీఎంవో ఆరా తీసింది. ప్రారంభోత్సవానికి ప్రధాని గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. నవంబర్‌ 28న ముహూర్తం ఖరారయ్యేలా ఉంది.
హైదరాబాద్ మెట్రోరైలుకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోడీ దాదాపు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఐతే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్ 28వ తేదీనే ముహూర్తం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. మెట్టుగూడ-బేగంపేట మార్గంలో రెండురోజులుగా టెస్ట్‌ రన్‌ కొనసాగుతుండగా, 15 నుంచి 20 రోజుల్లో పూర్తిస్థాయి ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తెలిపింది. మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించేందుకు రావాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోడీని కలిసి కోరడంతోపాటు లేఖ కూడా రాశారు. హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచపారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆ సందర్భంలో లేదా ప్రధాని ఎప్పుడు సమయమిస్తే అప్పుడే మెట్రోరైలును ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలిసింది.
మరోవైపు..నాగోల్ నుంచి మియాపూర్ వరకు ప్రారంభించనున్న మెట్రోరైలు పనులు ఏ స్థాయిలో ఉన్నాయి? ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధంగా ఉందా? అంటూ ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రాజెక్టు పనుల వివరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆరా తీసింది. ఈ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాజెక్టు పనుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యుత్తరం పంపింది. ఇప్పటివరకు నాగోల్ నుంచి మియాపూర్ వరకు జరుగుతున్న పనుల్లో 20 కిలోమీటర్ల దూరానికి సేఫ్టీ సర్టిఫికెట్ కూడా పొందినట్టు లేఖలో పేర్కొంది. అన్నిస్థాయిల్లో పనులు దాదాపు పూర్తికావస్తున్నాయని తెలిపింది. పీఎంవో నుంచి అధికారిక సమాచారం రాగానే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కానుంది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు ప్రారంభించనున్న మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్లో భాగంగా 15 నుంచి 20 రోజుల్లో మెట్టుగూడ-బేగంపేట మార్గంలో ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు ఎల్‌అండ్‌టీ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రెండ్రోజులుగా ఈ మార్గంలో టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. రోలింగ్ స్టాక్‌తోపాటు రైలును పరీక్షిస్తున్నారు. టెస్ట్‌ రన్‌ ముగిసిన తర్వాత ట్రయల్స్‌ చేపట్టి సేఫ్టీ క్లియరెన్స్ పొందే అవకాశముంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com