సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ దేశాన్ని ఒక్కటి చేశారు: మోడీ

- October 31, 2017 , by Maagulf
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ దేశాన్ని ఒక్కటి చేశారు: మోడీ

మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశాన్నంతా ఏకం చేసిన ఉక్కుమనిషి పటేల్ 143వ జయంతి సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. 

నేషనల్ యూనిటీ డే సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. నవభారత నిర్మాణంలో పటేల్ కృషి మరవలేనిదన్నారు. స్వాతంత్రానంతరం దేశాన్నంతా వల్లభాయ్ పటేల్ ఒక్కటి చేశారన్నారు. ఎంతోమంది కుట్రలను ఛేదించి దేశంలో ఐక్యత సాధించారన్నారు. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకతగా ప్రధాని వర్ణించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చిన మోడీ...  ఐక్యతా పరుగులో యువత అధికారికంగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఐక్యతా పరుగులో పాల్గొనేందుకు ఢిల్లీ వాసులు, బీజేపీ కార్యకర్తలు స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఇండియా గేట్ వద్ద జరిగే రన్ ఫర్ యూనిటీలో ఒలింపిక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్.. పాల్గొన్నారు. ప్రధాని జెండా ఊపి రన్ ఫర్ యూనిటీని ప్రారంభించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడిన ప్రధాని అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఐక్యతా పరుగులో దేశ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి రాగానే పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా పటేల్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com