తెలంగాణలో దళితులకు రవాణా రంగంలో శిక్షణ

- November 11, 2017 , by Maagulf
తెలంగాణలో దళితులకు రవాణా రంగంలో శిక్షణ

వాయు రవాణా రంగంలో దళితులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథమ్‌) అందించే ఎయిర్‌హోస్టెస్‌ కోర్సులో వారిని చేర్పించనుంది. ఇందులో చేరేందుకు 200 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా... తొలి బ్యాచ్‌ కింద వారిలో 50 మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ నిర్ణయించింది. దీని వ్యవధి ఆరు నెలలు. వారానికి రెండ్రోజులు శంషాబాద్‌ విమానాశ్రయంలో క్షేత్రస్థాయి తర్ఫీదు ఉంటుంది. ఇలాగే... ఈ ఏడాదికి సంబంధించి ఆరు సంస్థల ద్వారా వివిధ ఉపాధి కోర్సులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందుకు రూ.169 కోట్ల మేర ఖర్చు చేయనుంది. కొత్తగా చేర్చిన దర్జీ కోర్సు కింద కనీసం పదివేల మందికి కుట్లు, అల్లికలపై శిక్షణ ఇచ్చి... ఆధునిక కుట్టుమిషన్లు అందించాలని యోచిస్తోంది. అపోలో వైద్య సంస్థతోనూ కలిసి పలు కార్యక్రమాలను రూపొందించింది. వీటిల్లో చేరినవారికి వైద్య సంస్థల్లో కొలువులు లభించే అవకాశముంది. జాతీయ నిర్మాణ శిక్షణ సంస్థ 'నాక్‌' సహకారంతో ఉపాధి ఆధారిత శిక్షణ కోర్సులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కెల్ట్రాన్‌, ఎంఎస్‌ఎంఈ తదితర సంస్థలూ ఈ క్రతువులో భాగస్వామ్యమవుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com