రియాన్ స్కూల్ హత్యకేసు.. తప్పు ఒప్పుకున్నహర్యానా పోలీసులు

- November 13, 2017 , by Maagulf
రియాన్ స్కూల్ హత్యకేసు.. తప్పు ఒప్పుకున్నహర్యానా పోలీసులు

రియాన్ స్కూల్ విద్యార్ధి ప్రద్యుమన్ హత్య కేసు విచారణలో హర్యానా పోలీసులు ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు. గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వాల్.... ఈ కేసుపై దర్యాప్తు చేసిన అధికారులను పిలిపించి చీవాట్లు పెట్టారు. ఏడేళ్ల ప్రద్యుమన్ హత్య కేసులో విచారణ బృందం తొలుత బస్ కండక్టర్‌ అశోక్ కమార్‌ను అరెస్టు చేశారు. అతడికి చిన్నపిల్లలను లైంగికంగా వేధించే అలవాటు ఉందని, ప్రద్యుమన్‌ను వేధించి అతడే చంపేశాడని పోలీసులు అప్పట్లో పొంతనలేని విషయాలు చెప్పారు. తాజాగా.. తాము పొరబడ్డామనీ, సీసీటీవీ ఫూటేజిలు కూడా సరిగా చూడలేదని ఒప్పుకున్నారు. సీసీటీవీ ఫూటేజీల్లోని మొదటి కొద్ది సెకన్లలో.. ప్రద్యుమన్‌ను బాత్రూంకి రమ్మని నిందితుడైన టీనేజర్ పిలుస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న ఆధారాన్ని కూడా ఎలా వదిలిపెట్టారన్న దానిపై పోలీసులు నోరుమెదపడం లేదు.
కాగా ఈ హత్యపై రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)... ఇటీవల అసలు నిందితుడిని అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. 11 తరగతికి చెందిన సీనియర్ విద్యార్ధి స్కూల్ పరీక్షలు వాయిదాపడేలా చేసేందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు సీబీఐ అధికారులు వెలుగులోకి తెచ్చారు. సదరు టీనేజ్ విద్యార్ధి కూడా నేరాన్ని అంగీకరించడంతో హర్యానా పోలీసుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. బస్ కండక్టర్‌పై హర్యానా పోలీసుల బృందం చెప్పినవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. మరోవైపు బస్‌కండక్టర్ అశోక్ అరెస్టు సందర్భంగా.. రక్తంతో ఉన్న కత్తిని చూపించి పోలీసులు 'తప్పుడు ఆధారాలు సృష్టించారా' అన్న దానిపైనా సీబీఐ విచారణ జరుపుతోంది. బస్ డ్రైవర్ సౌరవ్ రాఘవ్‌ను కూడా పోలీసులు చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు కూడా నిగ్గుతేల్చనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com