కేరళ లవ్ జిహాద్ కేసు లో ఊహించని మలుపు

- November 25, 2017 , by Maagulf
కేరళ లవ్ జిహాద్ కేసు లో ఊహించని మలుపు

కేరళ లవ్ జిహాద్ కేసు ఊహించని మలుపు తిరిగింది. తాను భర్తతోనే ఉంటానని హదియా.. అలియాస్‌ అఖిలా అశోకన్ పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టుకు హాజరవడానికి శనివారం ఢిల్లీ బయల్దేరిన ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అఖిలపై దాడులు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో.. కొచ్చీ విమానాశ్రయంలో ఆమెకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. తాను ముస్లిమేనని, ఇకపై భర్తతోనే ఉంటానని ఆమె స్పష్టంచేసింది. మతం మార్చుకునే విషయంలో తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది. ఈ సందర్భంగా కోచి విమానాశ్రయం దగ్గర హైడ్రామా నెలకొంది.

కేరళకు చెందిన అఖిల గతేడాది షఫీన్‌ జెహాన్‌ అనే ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన పేరును కూడా హదియాగా మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించింది. ఆ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాహం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద కుట్రలో భాగమేనని వారు ఆరోపించారు. దీంతో ఈ ఉదంతం.. ‘లవ్‌ జిహాద్‌’ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. హదియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ చేపట్టగలుగుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ 27 ఆమెను కోర్టుకు తీసుకురావాలని హదియా తండ్రిని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టులో అసలు విషయం చెప్పేందుకు ఢిల్లీకి బయల్దేరింది.

కేరళ లవ్ జిహాదీకి సంబంధించి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవలే బయటికొచ్చిన ఓ వీడియోలో అఖిల అలియాస్ హదియా తన గోడు వెల్లబోసుకుంది. తన తండ్రే తనను క్రూరంగా హింసిస్తున్నాడని, చంపేసేలా ఉన్నాడని, దయచేసి ఇక్కడి నుంచి విడిపించాలంటూ అందులో వేడుకుంది. కేరళలో చోటు చేసుకున్న ఈ కేసును అక్కడి హైకోర్టు లవ్ జిహాదిగా అభివర్ణించి వివాహాన్ని రద్దు చేసింది. 24 ఏళ్ల అఖిల అశోకన్ అనే యువతిని ఇస్లాం మతంలోకి మార్చి.. షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు తమ వివాహాన్ని రద్దు చేయడంతో షఫిన్ సుప్రీం కోర్టులో దాన్ని సవాల్ చేశారు.

పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలు ఉన్నాయన్న ప్రాసిక్యూటర్‌ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సమయంలో ఇద్దరు మేజర్ల వివాహాన్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానికి ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది సుప్రీం. అదే సమయంలో అఖిల తండ్రికి కూడా ఆమెను నియంత్రించే హక్కు లేదని గుర్తుచేసింది. హాదియా వ్యక్తిగతంగా హాజరైతేనే కేసుముందుకెళ్తుందని సుప్రీంచెప్పడంతో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 27న కేసు విచారణకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com