షెరిన్ హత్యకేసులో కీలక మలుపు

- November 30, 2017 , by Maagulf
షెరిన్ హత్యకేసులో కీలక మలుపు

హ్యూస్టన్‌: సంచలనం రేపిన మూడేండ్ల చిన్నారి షెరిన్‌ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఒక్కో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షెరిన్‌ శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు. నివేదికపై డాక్టర్‌ సుషాన్‌ దకిల్‌ మాట్లాడుతూ.. చిన్నారి శరీరానికి సంబంధించి ఎక్స్‌రేలను పరిశీలించినట్టు తెలిపారు. సెప్టెంబరు2016 నుంచి ఫిబ్రవరి 2017 మధ్యలో షెరిన్‌ శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. తొడ ఎముకకు చికిత్స చేసిన గుర్తులు ఎక్స్‌రేస్‌ ద్వారా తెలుస్తున్నాయి. పాప శరీరంలోని కొన్ని భాగాల్లో ఎముకలు విరిగిపోయాయి. భారత్‌ నుంచి దత్తత తీసుకొని వెళ్లిన తర్వాతే పాప శరీరంలో ఈ గాయాలు అయినట్లు దకిల్‌ చెబుతున్నారు. పాప శరీరంలో గాయాల గురించి దత్తత తీసుకున్న తల్లి సిని మాథ్యూస్‌ను న్యాయవాదులు ప్రశ్నించగా, ఆమె స్పందించలేదు. టెక్సాస్‌లోని డాలస్‌ శివారు ప్రాంతంలో అక్టోబర్‌7న షెరిన్‌ అదృశ్యమైన విషయం తెలిసిందే. పాలు తాగడం లేదని చిన్నారిని అర్ధరాత్రి బయట నిలబెట్టానని, కొద్దిసేపటికి వెళ్లి చూస్తే పాప అక్కడ లేదని తండ్రి వెస్లీ మాథ్యూస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్‌22న చిన్నారి షెరిన్‌ మృతదేహం ఇంటికి సమీపంలో లభ్యమైంది. దీంతో వెస్లీని పోలీసులు విచారించడంతో అసలు విషయం బయట పెట్టాడు. పాలు తాగకపోవడంతో బలవంతాన పాలు తాగించేసరికి వూపిరాడక పాప చనిపోయిందని వెస్లీ నేరాన్ని అంగీకరించాడు. 
షెరిన్‌ను భారత్‌కు చెందిన ఓ అనాథాశ్రమం నుంచి వెస్లీ, సిని మాథ్యూస్‌ దంపతులు గతేడాది దత్తత తీసుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com