దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సింధు, శ్రీకాంత్

- December 11, 2017 , by Maagulf
దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సింధు, శ్రీకాంత్

పీవీ సింధు మరో సూపర్‌ సిరీస్‌కు సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే దుబాయ్‌ ఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. బుధవారం నాటి మ్యాచ్‌లో తనకంటే తక్కువ ర్యాంకు కలిగిన చైనా క్రీడాకారిణి బింగ్‌జియావోతో తలపడనుంది. ప్రపంచ బ్యాడ్మింట్‌ ర్యాంకుల్లో సింధు ప్రస్తుతం మూడవ ర్యాంకులో ఉంది. ఈయేడాది సాధించిన విజయాలతో సంతృప్తిగా ఉన్నానని, మరో గెలుపుతో 2017 సీజన్‌ను ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. జపాన్‌ క్రీడాకారిణిలు అకానె యమగూచి, సయాకో సటో (15 ర్యాంకు), బింగ్‌జియావో (19 ర్యాంకు) లతో కలిసి సింధు గ్రూప్‌ -ఎలో ఉంది. రౌండ్‌రాబిన్‌ ఫార్మాట్‌లో జరిగే పోటీలో ప్రతి గ్రూప్‌లోని నలుగురు ఆటగాళ్లు పరస్పరం పోటీ పడాల్సి ఉంటుంది. మరోగ్రూపులో తాయ్‌ జు యింగ్‌ (చైనా), సంగ్‌ జి హ్యున్‌ (కొరియా), రాట్చనాక్‌ ఇంటనాన్‌ (థాయ్‌లాండ్‌), చెన్‌ యుఫీ (చైనా) ఉన్నారు. ప్రపంచ చాంపియన్‌ నొజొమి ఒకుహరా, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత కరొలినా మారిన్‌లు ఈ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఇండియన్‌ ఓపెన్‌, కొరియా సూపర్‌ సిరీస్‌లలో విజయం సాధించి దూకుడుమీదున్న సింధు, దుబాయ్‌ ఫైనల్స్‌ సూపర్‌ సిరీస్‌లోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతోంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున ప్రపంచ నంబర్‌ నాలుగో ర్యాంకు ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ గ్రూప్‌-బి నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఇదే గ్రూపులో ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ విక్టర్‌ యాక్సెల్సెన్‌ (డెన్మార్క్‌), చౌ టైన్‌ చెన్‌, షియుఖి ఉన్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్‌ యాక్సెల్సెన్‌ను ఎదుర్కోవాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com