బాంబు బెదిరింపులకు కారణంగా సాకర్ మ్యాచ్, రైళ్లు రద్దు

- November 18, 2015 , by Maagulf
బాంబు బెదిరింపులకు కారణంగా సాకర్ మ్యాచ్, రైళ్లు రద్దు

జర్మనీలోని హనోవర్‌ నగరంలో బాంబులు పెట్టారన్న సమాచారం భద్రతా దళాలను ఉరుకులు, పరుగులు పెట్టించింది. దీంతో స్థానిక స్టేడియంలో జరగాల్సిన జర్మనీ-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన పుట్‌బాల్‌ మ్యాచ్‌ రద్దయింది. ఓ రైల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం రావడంతో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. జర్మనీ-నెదర్లాండ్స్ జట్ల మధ్య మంగళవారం రాత్రి ఫెండ్లీ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ జరగాల్సిన స్టేడియం మీద బాంబు దాడి జరగవచ్చునని స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అధికారులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆటగాళ్లను, ప్రేక్షకులను స్టేడియం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అక్కడి మంత్రి బారిస్ పిస్టోరియస్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, హనోవర్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో దొరికిన ఓ బ్యాగ్‌ కలకలం సృష్టించింది. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ప్రమాదకర పదార్థాలు ఏమీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అదేనగరంలో వేరొక స్టేడియంలో జరగాల్సిన సంగీత విభావరి కూడా బాంబు సమాచారం కారణంగా రద్దయింది. ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమాచారాన్ని తేలికగా తీసుకోలేమని పోలీసులు చెప్పారు. ప్రజల భద్రతే ముఖ్యమని తెలిపారు. కాగా, ఇదే సాయంత్రం బాంబు బెదిరింపులకు కారణంగా, అమెరికా నుంచి ప్యారిస్ వెళ్లే పలు విమానాలను కూడా రద్దు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com