సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాలు..
- January 03, 2018
సంక్రాంతి ముగ్గులతో తెలుగు లోగిళ్లు అందంగా ముస్తాబవుతాయి. పల్లెలు కళకళలాడుతాయి. బంధువులతో సందడి చేయడానికి పల్లెకి పయనమవుతుంది పట్నమంతా. ముగ్గులు, గొబ్బెమ్మలతో అమ్మాయిలు అలరిస్తే.. అబ్బాయిలు మాత్రం పుంజుతో పందెం కాస్తామంటారు... ఇక సినిమా తారలు కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుంటారు. కొత్త సినిమాలు కొత్త సంవత్సరంలో అందునా మొదటగా వచ్చే పండుగ సంక్రాంతికి రిలీజ్ చేస్తే వచ్చే కిక్కేవేరన్నట్టుగా పోడీ పడుతుంటారు అటు దర్శకులు, ఇటు హీరోలు కూడా..
మొత్తం నాలుగు చిత్రాలయితే సంక్రాంతికి సందడి చేయడానికి లైన్లో ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవలసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'అజ్ఞాతవాసి' గురించే. ఇప్పటికే అందులోని పాటలు రిలీజ్ అయ్యి మిలియన్లలో వ్యూయర్షిప్ని సొంత చేసుకుంది. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అని ఇంతకు ముందు వచ్చిన చిత్రాలు రుజువు చేశాయి. ఒకటి జల్సా అయితే, మరొకటి అత్తారింటికి దారేది. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలు చేసి కొత్త ట్రెండ్ని సృష్టించాయి ఈ రెండు చిత్రాలు. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్ర మంటే ప్రేక్షకులకు భాగ్య నగర వాసులకు ప్యారడైజ్ బిర్యానీ అయితే, పల్లె వాసులకు ముద్దపప్పు, ఆవకాయ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నంత ఆనందంగా ఉంటుంది. వీరేంటి.. ప్రపంచమంతా పవన్ మానియానే నడుస్తోందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అమెరికాలో కూడా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రం కూడా ఇదే. ఈ విషయంలో 'బాహుబలి' రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నాడు పవన్. ఈనెల పదిన విడుదల చేయడానికి పరుగులు పెడుతోంది 'అజ్ఞాతవాసి'.
సంక్రాంతి బరిలో ఉన్న మరో చిత్రం హీరో రాజ్ తరుణ్, చిత్రా శుక్లా కాంబినేషన్లో వస్తున్న 'రంగుల రాట్నం'. అన్నపూర్ణ సంస్థ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపై కూడా చాలానే హోప్స్ ఉన్నాయి. గత ఏడాది ఈ సంస్థ నుంచి వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' చిత్రాలు విజయవంతమవడంతో, కొత్త ఏడాది 'రంగుల రాట్నం'తో అన్నపూర్ణలో హరివిల్లులు విరబూస్తాయని ఆశించడంలో తప్పులేదు కదా! అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు చిత్ర యూనిట్. రాజ్ తరుణ్ ఎంతవరకు న్యాయం చేసాడో తెరపై చూద్దాం.
ఇక ప్రముఖంగా ప్రస్తావించాల్సిన మరో చిత్రం బాలయ్య 'జై సింహ'. బాలకృష్ణ అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలకృష్ణ అన్నంతగా పెనవేసుకుని వుంటుంది తెలుగు ప్రేక్షకులతో బాలయ్య బంధం. సంక్రాంతికి విడుదలయ్యిందీ అంటే సక్సెస్ చూడాల్సిందే బాలకృష్ణ సినిమా. ఇంతకు ముందు విడుదలైన చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు వస్తున్న జై సింహ చిత్రంలో బాలకృష్ణ డైలాగులు, నయన తార స్టెప్పులు ప్రేక్షకుల అంచనాలని వమ్ము చేయవనే ఆశిస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్ర డేట్ని కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు నిర్మాత, దర్శకులు.
అయితే తెలుగు పుంజుల మధ్యలోకి అరవ పుంజు కూడా వచ్చి చేరుతోంది. అదే సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం. అందాల తార కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం బాలీవుడ్ 'స్పెషల్ ఛబ్బీస్'కి రీమేక్. సూర్యకి ఇక్కడ మార్కెట్ బాగానే ఉంది. ఆ ఆశతోనే ఈ నెల 12న విడుదల చేస్తున్నారు ఈ చిత్రాన్ని. మొత్తంగా చూస్తే సంక్రాంతి సినిమా మార్కెట్ రూ.200 కోట్లని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







