తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్య నైవేద్య ప్రసాదం తయారీలో బెల్లం కొరత

- January 27, 2018 , by Maagulf
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్య నైవేద్య ప్రసాదం తయారీలో బెల్లం కొరత

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్య నైవేద్య ప్రసాదం తయారీలో బెల్లం కొరత ఏర్పడింది. తితిదే మార్కెటింగ్‌ గోదాముల విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య తలెత్తింది. శ్రీవారికి వివిధ రకాల ప్రసాదాలను నిత్యం నైవేద్యం సమయంలో నివేదిస్తారు. అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. ఇందులో బెల్లం పొంగలికి విశేష ప్రాధాన్యం ఉంది. బెల్లం నిల్వలు నిండుకోవడంతో ఆఖరుకు భక్తులు తులాభారం రూపంలో సమర్పించిన బెల్లాన్ని ప్రసాదం తయారీకి వినియోగించారు. అన్న ప్రసాదంవద్దా నిత్యం సుమారు 650 కిలోల బెల్లంతో పొంగలి తయారు చేసి భక్తులకు వడ్డిస్తుంటారు. ఇక్కడా బెల్లం కొరత కారణంగా మూడు రోజులుగా చక్కెర పొంగలి తయారు చేసి వడ్డిస్తున్నారు. స్వామివారి ప్రసాదం తయారీకి సమస్య తలెత్తిన విషయం బహిరంగం కావడంతో తితిదే అధికారులు యుద్ధప్రాతిపదికన తిరుపతి నుంచి తిరుమలకు శనివారం సాయంత్రం 2వేల కిలోల బెల్లం తీసుకొచ్చారు. తిరుపతి గోదాములో 20వేల కిలోల బెల్లం ఉన్నా నాణ్యత పరీక్షలో ఆలస్యం కారణంగా దానిని వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. 31న శ్రీవారి ప్రత్యేక దర్శనాలు నిలిపివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనాలన్నీ ఈనెల 31న రద్దుచేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు.

తిరుమలలో శనివారం జేఈవో విలేకరులతో మాట్లాడారు. గ్రహణానంతరం రాత్రి 9.30 గంటలకు ఆలయం తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తామని, రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. గ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, దివ్యదర్శనం టోకెన్ల జారీ తదితరాలన్నీ రద్దుచేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com