కువైట్:' దేవుడు ..వరమిస్తే ...పూజారి అడ్డం పడినట్లు ' .... క్షమాభిక్ష అంటూ కువైట్ ప్రభుత్వం కరుణిస్తే ... గుర్తింపు కార్డులంటూ రాయబార కార్యాలయం మోకాలు అడ్డం పెట్టింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో కొందరు ప్రవాసీయులు తమ దురదృష్టానికి దుఃఖిస్తున్నారు. ఎట్టకేలకు ఏడేళ్ల తరువాత కువైట్ ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఖానూన్ ( ఆమ్నెస్టీ ) ప్రకటించింది. అరుదుగా లభ్యమయ్యే ఈ అపూర్వ అవకాశం కోసమే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రవాసీయులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాయబార కార్యాలయం విధించిన నియమ నిబంధనలు కొందరికి శాపంగా మారేయి. దీంతో కొందరిలో క్షమాబిక్ష అవకాశం ఏమాత్రం సంతోషం కనిపించడం లేదు. సరైన గుర్తింపు కార్డులను చూపనివారి దరఖాస్తులను కువైత్ ఎంబసీలో అధికారులు నిర్దయగా పెదవి విరిచి తిరిగి ఇచ్చేయడంతో వందలాది మంది ఎంబసీ వద్ద దిగాలుగా కూర్చొని ఉన్నారు. పలు కారణాలతో పాస్పోర్టులు, అకామా (ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రం) లేని దాదాపు 200మంది తెలుగువారు కువైట్ లో చిక్కుల్లో పడ్డారు.