ఏపీ ప్రజలు జీఎస్టీతోపాటూ తెలుగు తమ్ముళ్లకు సర్వీస్ టాక్స్ కట్టాల్సి వస్తోంది : జగన్

- March 24, 2018 , by Maagulf
ఏపీ ప్రజలు జీఎస్టీతోపాటూ తెలుగు తమ్ముళ్లకు సర్వీస్ టాక్స్ కట్టాల్సి వస్తోంది : జగన్

గుంటూరు జిల్లాలోని వ్యాపారులు జీఎస్టీతోపాటూ టీఎస్టీ దెబ్బకు బెంబేలెత్తుతున్నారని జగన్ మండిపడ్డారు. జన్మభూమి కమిటీల నుంచి ప్రాజెక్టుల వరకూ ప్రతి ఒక్కరూ తెలుగు తమ్ముళ్లకు సర్వీస్ టాక్స్ కట్టాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లంచం ఇవ్వాల్సి వస్తోందన్న జగన్.. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ అయ్యిందన్నారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 119వ రోజు నర్సరావుపేటలో పాదయాత్ర చేసిన జగన్.. రాష్ట్రంలో ఒక్క ఏడాది కూడా వరి వేసే పరిస్థితి లేదన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువలో నీళ్లున్నా..అన్నదాతలు పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. నాలుగేళ్లలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదన్నారు జగన్. 
రైతులు మార్కెట్ యార్డుకు వెళ్తే నీది ఏ పార్టీ అని అడిగే పరిస్థితి వచ్చిందన్నారు జగన్. పంట అమ్ముకోవాలన్నా  లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్రంలో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉంటే ఏపీలో జీఎస్టీతోపాటూ టీఎస్టీ అనే తెలుగుదేశం సర్వీస్ టాక్స్ కూడా కట్టాల్సొస్తోందన్నారు. 119వ రోజు గుంటూరు జిల్లా కావూరు శివార్ల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభిన వైసీపీ అధినేత.. కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్‌ పాలెం, బాసిక్‌ పురం, కేశానుపల్లి మీదుగా నర్సరావుపేట చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత రాత్రి అక్కడే బస చేశారు. 120 రోజు నర్సరావుపేట నుంచే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com