రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే

- April 03, 2018 , by Maagulf
రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఓపెన్ కోర్టులో దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీకోర్టు గత నెల 20న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ దేశ వ్యాప్తంగా దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. పలురాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సోమవారం హుటాహుటిన సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 లోని ఏ నిబంధనలను సడలించినా రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది.

దేశంలో కొనసాగుతున్న హింస కారణంగా అత్యవసర పరిస్థితి వాతవరణం కనిపిస్తోందనీ.. ఓపెన్ కోర్టులో దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఇవాళ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా... జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కాగా సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నిన్న అఖిల భారత ఎస్సీ ఎస్టీ సంఘాల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com