ఫేక్‌ న్యూస్‌ పై ఆదేశాలు.. వెనక్కి తగ్గిన కేంద్రం

- April 03, 2018 , by Maagulf
ఫేక్‌ న్యూస్‌ పై ఆదేశాలు.. వెనక్కి తగ్గిన కేంద్రం

న్యూఢిల్లీ : తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. నకిలీ వార్తలు ప్రచురిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో వివిధ ఛానెళ్ల, పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి  పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు  ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. అయినా ఆందోళనలు చల్లారకపోవటంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో చర్చించిన తర్వాతే ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com