బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

- April 12, 2018 , by Maagulf
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎత్తేసింది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, హింసను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లను ఎత్తేస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమందికి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో హసీనా ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఢాకా విశ్వవిద్యాలయంలో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు, బాష్పవాయువు‌ ప్రయోగించి వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దాదాపు వంద మంది విద్యార్థులు గాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లోని రిజర్వేషన్‌ విధానం ప్రకారం ప్రభుత్వ రంగంలోని 56శాతం ఉద్యోగాలు స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు, మహిళలకు, జాతిపరమైన మైనార్టీలకు, దివ్యాంగులకు, వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి కేటాయించారు. అయితే ఈ కోటాను పది శాతానికి తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ కల్పిస్తున్న ప్రత్యేక గ్రూపులకు చెందిన వారు రెండు శాతం మాత్రమే ఉన్నారని, మిగతా 98శాతం మంది కేవలం 44శాతం ఉద్యోగాల కోసం పోటీ పడాల్సి వస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. విద్యార్థులు వద్దని కోరుకుంటున్నందున రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నామని ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. విద్యార్థులు ఆందోళనలు విరమించాలని కోరారు. ఢాకా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘర్షణలు, వైస్‌ ఛాన్సలర్‌ నివాసంపై దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. దాడులు, ధ్వంసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com