అమెరికా దౌత్యవేత్తను కదలనివ్వని పాకిస్థాన్!

- May 12, 2018 , by Maagulf
అమెరికా దౌత్యవేత్తను కదలనివ్వని పాకిస్థాన్!

ఇస్లామాబాద్ : ఓ అమెరికా దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్ళరాదని పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఆయన కోసం వెళ్ళిన అమెరికా సైనిక విమానం ఖాళీగా తిరిగి వెళ్ళిపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ అమెరికా దౌత్యవేత్త కారు ఏప్రిల్ 7న ఓ మోటారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్‌ను నడుపుతున్న 22 ఏళ్ళ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో దౌత్యవేత్తపై పాకిస్థాన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆ దౌత్యవేత్తను తమ దేశానికి తీసుకెళ్ళిపోవడానికి అమెరికా ప్రయత్నించింది. శుక్రవారం అమెరికా ఎయిర్ ఫోర్స్ సీ130ని పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి పంచింది. కానీ ఆ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్ళరాదని పాకిస్థాన్ ఆదేశించడంతో ఆ విమానం ఆయనను తీసుకెళ్ళకుండానే తిరిగి వెళ్ళిపోయింది.

అమెరికాలో తమ దౌత్యవేత్తలు, సిబ్బందిపై ఆ దేశం అమలు చేస్తున్నట్లుగానే తాము కూడా తమ దేశంలోని అమెరికా దౌత్యవేత్తలపై ఆంక్షలను అమలు చేస్తున్నామని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించారు. కానీ ఇతర వివరాలను వెల్లడించలేదు.

ఈ సంఘటనపై స్పందించేందుకు పాకిస్థాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయ వర్గాలు నిరాకరించాయి. వాషింగ్టన్‌లోని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ ఈ కేసులో ప్రమేయం ఉన్నవారి వ్యక్తిగత గోప్యత, భద్రత నిమిత్తం తమ దౌత్యవేత్త ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పలేమని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com