భారత్‌కు చైనా మరోసారి సవాల్

- May 20, 2018 , by Maagulf
భారత్‌కు చైనా మరోసారి సవాల్

భారత్‌కు చైనా మరోసారి సవాల్ విసిరింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదేనంటూ ఎప్పటి నుంచో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కుట్రలకు అసలు కారణం తెలిసింది. చైనా-అరుణాచల్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బంగారం గనులు ఉండడమే అని హాంకాంగ్ పత్రిక ఒకటి కథనం వెలువరించింది. ఇప్పటికే గోల్డ్ మైనింగ్‌ను చైనా మొదలు పెట్టినట్లు తెలిపింది.

అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్‌కు సమాధానం దొరికింది. సరిహద్దుల్లో భారీగా బంగారం గనులు ఉండడమే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో, చైనా అధీనంలో ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం, వెండి, ఇతర విలువైన ఖనిజాల గనులు ఉన్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ఓ కథనం వెలువరించింది. ఈ ఖనిజాల విలువ 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

చైనా ఇప్పటికే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని తెలిపింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో గనుల తవ్వకాలు జరుగుతున్నాయనీ, ఇటీవల తవ్వకాలను చైనా భారీగా పెంచింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేననీ, దక్షిణ టిబెట్‌లో ఆ రాష్ట్రం భాగమని చైనా 
ఇప్పటికే వాదిస్తోంది. ఈ ఈశాన్య రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు చైనా చూస్తోందనీ, ఆ ప్రయత్నంలో భాగంగానే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఈ బంగారం గనులతో మరోసారి భారత్-చైనా మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా అరుణాచలప్రదేశ్‌పై తన పట్టును చాటేందుకు చైనా ఇక్కడ పని కట్టుకుని మైనింగ్ ఆపరేషన్స్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గతంలో డొక్లాంపై 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రాంతంలో మైనింగ్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా చైనా భారత్‌కు సవాలు విసిరినట్లయింది.

పర్యావరణ పరంగా కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాంతంలో కనీవినీ ఎరుగని విధంగా రోడ్ల నిర్మాణాన్ని చైనా చేపట్టింది. 

ఇక్కడ పర్వతాల్లో సొరంగ మార్గాలను తవ్వుతున్నారు. మైనింగ్ జరిగే హుంజే ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలను చైనా తరలిస్తోంది. చైనాకు వచ్చే 80 శాతం ఆదాయం మైనింగ్ నుంచి వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com