బాగ్దాద్‌లో జంట బాంబు పేలుళ్లు...

- June 06, 2018 , by Maagulf
బాగ్దాద్‌లో జంట బాంబు పేలుళ్లు...

బాగ్దాద్‌ : బాగ్దాద్‌కు చెందిన సర్ద్‌ సిటీ జిల్లాలోని ఒక షియా మసీదులో జరిగిన జంట బాంబు పేలుళ్ళలో పలువురు మృతి చెందగా, 90 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై మృతులు, గాయపడిన వారి సంఖ్య వివరాలతో సహా ఈ పేలుళ్లకు గల కారణాలపై కూడా భిన్న కథనాలు వెలువడుతుండటం విశేషం. రాయిటర్స్‌ కథనం ప్రకారం ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ఎఎఫ్‌పి కథనం ప్రకారం 16 మంది మృతి చెందారు. కాగా ఆల్‌ జజిరా ఏడుగురు మృతి చెందినట్లు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. స్టేట్‌ మీడియాకు చెందిన ఓ ప్రతినిధి దీనిని 'పౌరులపై జరిగిన ఉగ్రవాద దాడ'ిగా పేర్కొన్నారు. అయితే ఓ పోలీసు అదికారి కథనం ప్రకారం ఈ పేలుళ్లు మసీదులోని మందుగుండు సామాగ్రిని కారులో చేరుస్తుండగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. షియా మతగురువు ముక్తాదా అల్‌-సర్ద్‌ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది మే 12న జరిగిన ఎన్నికల్లో వీరి సంకీర్ణం ఎక్కువ స్థానాలను గెలుచుకొంది.

అయితే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమయం పట్టింది. ఆ సమయంలో ఇరాక్‌ పార్లమెంట్‌లో 11 మిలియన్ల ఓట్లను రీ కౌంటింగ్‌ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌పై రెండు సాధారణ బాంబులతో దాడి కూడా జరిగింది. అయితే కమ్యూనిస్టు పార్టీ కూడా గెలిచిన సంకీర్ణంలో భాగమే.

మొత్తంగా ఈ సంఘటన ఒకే సంకీర్ణంలోని అంతర్గత రాజకీయ కలహాల వల్ల జరిగిందా..., లేకుంటే ఉగ్రవాదుల చర్యా అనేది తేలాల్సివుంది. ఈ రెండు కాకుంటే మందుగుండు సామాగ్రిని తరలిస్తున్నట్లు ప్రమాదవశాత్తు జరిగిందా అనేది కూడా ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఇరాక్‌పై అమెరికా దండయాత్ర చేసిన అనంతరం షియాలకు చెందిన సర్ద్‌ మద్దతుదారులు అమెరికా బలగాలకు వ్యతిరేకంగా పోరాడటం ఈ సందర్భంగా గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com