నా బయోపిక్‌లో ఆమే నటించాలి మా వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి

- July 09, 2018 , by Maagulf
నా బయోపిక్‌లో ఆమే నటించాలి మా వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి

ఈ మధ్యకాలంలో క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కించేందుకు దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సచిన్‌ తెందుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, అజహరుద్దీన్‌, మిల్కా సింగ్‌, మేరీ కోం తదితరుల బయోపిక్‌లు వచ్చాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు పి.వి సింధు, సైనా నెహ్వాల్‌ల బయోపిక్‌లు సిద్ధమవుతున్నాయి. మరోపక్క ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్‌ సింగ్‌ జీవితాధారంగా 'సూర్మ' అనే సినిమా రాబోతోంది. ఇప్పుడు మహిళా టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ పట్టాలెక్కబోతోంది. ఈ విషయాన్ని మిథాలీ మీడియా ద్వారా వెల్లడించారు. వయాకామ్‌ 18 సంస్థ బయోపిక్‌ కోసం తనను సంప్రదించినట్లు తెలిపారు. ఇందుకు తానూ ఒప్పుకున్నానని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే తన బయోపిక్‌లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. 'నా పాత్రలో ప్రియాంక చోప్రా సరిగ్గా సరిపోతారు.

మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. అయితే నాకు సినిమాల గురించి పెద్దగా తెలీదు. కాబట్టి నా బయోపిక్‌లో ఎవరు నటించాలి? అన్న విషయాన్ని చిత్రబృందానికే వదిలేస్తున్నాను.

బయోపిక్‌ కోసం కావాల్సిన అన్ని విషయాలను నేను చిత్రబృందానికి వెల్లడించాను. సినిమా స్క్రిప్టింగ్‌ దశలో ఉంది. అది పూర్తయ్యాక ఒకసారి చదివి ఇంకేమన్నా కలపాల్సిన అంశాలుంటే చెప్తాను. 2019లో సినిమా చిత్రీకరణ మొదలవబోతోంది.

ఈలోగా నేను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నా ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నాను.' అని తెలిపారు. వచ్చే ఏడాది మిథాలీతో పాటు మరో ఇద్దరు క్రికెటర్ల బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ధోనీ బయోపిక్‌కు సీక్వెల్‌ తీయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అందులో వరల్డ్‌ కప్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిషేధం, రిటైర్మెంట్‌ తదితర అంశాలను ప్రస్తావించనున్నారు.

మరోపక్క మాజీ క్రికెటర్‌, కపిల్‌ దేవ్ బయోపిక్‌ కూడా రాబోతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com