టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది...

- August 12, 2018 , by Maagulf
టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది...

లండన్‌: ప్రతిష్టాత్మక లార్డ్స్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో ఓడినప్పటికీ కనీస పోరాటపటిమను ప్రదర్శించిన భారత బ్యాట్స్‌మెన్‌.. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి విలవిలలాడారు. లార్డ్స్‌ మైదానంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ పరుగులు కాదుకదా క్రీజులో నిలదొక్కుకోడానికే నానాతంటాలు పడ్డారు. బ్రిటీష్‌ బౌలర్‌ జిమ్మీ(4/23) మరోసారి నిప్పులు చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. బ్యాట్‌తో అటు బంతితో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 18 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరగనుంది.

నాల్గో రోజు ఆటలో భాగంగా ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను 357/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో కొనసాగించిన ఇంగ్లండ్‌.. 396/7  స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.  ఒక వికెట్‌ కోల్పోయి 39 పరుగులు జోడించిన తర్వాత ఇంగ్లండ్‌ తన ఇన‍్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో భారత్‌పై ఇంగ్లండ్‌కు 289 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచి అపసోపాలు పడింది. అసలు బ్యాటింగ్‌ ఎందుకు దిగారో తెలియనంతంగా చెత్త ప్రదర్శన చేసింది. మురళీ విజయ్‌ డకౌట్‌గా నిష్క్రమించగా, కేఎల్‌ రాహుల్‌(10) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో భారత జట్టు 13 పరుగులకే రెండో వికెట్‌ నష్టపోయింది. ఆపై అజింక్యా రహానే(13), చతేశ్వర్‌ పుజారా(17), విరాట్‌ కోహ్లి(17)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అటు తర్వాత దినేశ్‌ కార్తీక్‌(0) పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా ఔటయ్యాడు. అనంతరం హర్దిక్‌ పాండ్యా(26), అశ్విన్‌(33) పోరాడటంతో వందపరుగుల స్కోరునైనా దాటింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్స్‌న్‌(4/23) స్టువార్ట్‌ బ్రాడ్‌(4/44), క్రిస్‌ వోక్స్‌(2/24) టీమిండియా పతనాన్ని శాసించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com