పంద్రాగష్టుకు లండన్‌లో భారత పతాకావిష్కరణ

- August 15, 2018 , by Maagulf
పంద్రాగష్టుకు లండన్‌లో భారత పతాకావిష్కరణ

లండన్‌: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా బ్రిటన్‌ రాజధాని లండన్‌లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంది. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటింగ్‌హామ్‌కు బయలుదేరే ముందు హోటల్‌ బయటకు వచ్చిన ఆటగాళ్లంతా ఒకే చోటకు చేరారు. పతకావిష్కరణ కాగానే జాతీయగీతం ఆలపించారు. 'భారత క్రికెట్‌ జట్టు తరఫున ఇక్కడి నుంచి ప్రతీ ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌' అని కోహ్లీ పేర్కొన్నాడు.

రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, తదితరులు జెండా ముందు ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 'భారతీయుడిని కావడం గర్వకారణం. నా మువ్వన్నెల జెండా ఎప్పుడూ ఆకాశంలో అత్యంత ఎత్తున ఉండాలి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, జైహింద్‌' అని కుల్‌దీప్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 'స్వాతంత్ర్యమంటే మెరుగ్గా ఉండేందుకు మరో అవకాశం' అని ట్వీట్ చేశాడు.

జట్టు సంబరాలు చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీమిండియా శ్రీలంకలో చేసుకుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకబడిన కోహ్లీసేన ఆగష్టు నెల 18 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం నాటింగ్‌హామ్‌ బయలుదేరింది.

రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టులో కీలక మార్పులుంటాయని భావిస్తున్నారు. ఓ వైపు ప్రాక్టీసును ముమ్మరం చేసిన భారత్.. మరో వైపు జట్టు కూర్పు విషయంలోనూ తర్జనభర్జనలు పడుతోంది. రెండో టెస్టులో 159 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అన్నీ తానై నడిపించిన కెప్టెన్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టులో సరిగా ప్రదర్శించలేకపోయాడు. మూడో టెస్టులోనైనా రాణిస్తేనే విజయంపై ఆశలు సజీవంగా ఉంటాయని సీనియర్ క్రికెటర్లతో పాటు సగటు అభిమాని కోరుకుంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com