కేరళ బాధితులకు రూ.17కోట్లు అందజేసిన భారత సంతతి అరబ్‌ వ్యాపారులు

- August 20, 2018 , by Maagulf
కేరళ బాధితులకు రూ.17కోట్లు అందజేసిన భారత సంతతి అరబ్‌ వ్యాపారులు

యూ.ఏ.ఈ:వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కేరళ కోలుకుంటోంది. గత పన్నెండు రోజులుగా ప్రకృతి విలయతాండవం చేయడంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రకృతి బీభత్సానికి సుమారు 400మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. సుమారు 10లక్షలమంది పునరావాసాల్లో రక్షణ పొందుతున్నారు. ప్రకృతి అందాలకు నెలవుగా పేరుగాంచిన కేరళ ప్రజల జీవితాన్ని వరదలు చిన్నాభిన్నం చేశాయి. ఈ క్రమంలో వారికి చేయూత నివ్వడానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, మరెందరో ముందుకు వస్తున్నారు.ఇప్పుడు ఈ జాబితాలో ప్రవాస భారతీయులు కూడా చేరిపోయారు. యూఏఈలో ఉన్న భారత సంతతికి చెందిన వ్యాపార వేత్తలు కలిసి కేరళ బాధితులకు రూ.17కోట్ల మేర విరాళం అందించారు.

ఇందులో యూఏఈలో నివాసం ఉంటున్న కేరళకు చెందిన వ్యాపరి యూసుఫ్‌ అలీ అనే వ్యక్తి రూ. 5కోట్లు ఇచ్చారు. అక్కడి లులు గ్రూప్‌ ఎండీ అయిన ఈయన తన సొంతరాష్ట్రానికి తన వంతు సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. యూఏఈలోని ఫాతిమా హెల్త్‌కేర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కేపీ హుస్సేన్‌ కూడా రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. ఇందులో కోటి రుపాయలు సీఎం సహాయనిధికి పంపగా, మరో రూ.4కోట్ల విలువైన మెడిసిన్లను కేరళకు పంపనున్నట్లు తెలిపారు.

భారత సంతతికి చెందిన వ్యక్తి, యునిమోని, యూఏఈ ఎక్స్ఛేంజ్‌ ఛైర్మన్‌ బీఆర్‌ శెట్టి రూ. 2 కోట్లు, ఫిజీషియన్‌, ఫిలాంథ్రోపిస్ట్‌, ఆస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ అయిన ఆజాద్‌ మోపెన్‌ రూ.5కోట్లు విరాళంతో పాటు అక్కడ సహాయక చర్యలు చేయడానికి 300మంది వలంటీర్లను పంపారు.

వీరితోపాటు యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కేరళకు పంపారు. యూఏఈ ప్రభుత్వం తరఫున కేరళ ప్రజలకు వీరందరూ సహాయక చర్యలు అందిస్తున్నారు. యూఏఈలో సుమారు 2.6కోట్ల మంది భారతీయులున్నారు. యూఏఈ మొత్తం జనాభాలో 30%మంది భారతీయులే.అక్కడ ఉంటున్న విదేశీయుల్లో భారతీయులే అధికం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com