బాబ్లీ కేసు.. ఏ.పి సి.యం వేసిన రీ కాల్ పిటిషన్‌ను తిరసర్కించిన కోర్టు

- September 21, 2018 , by Maagulf
బాబ్లీ కేసు.. ఏ.పి సి.యం వేసిన రీ కాల్ పిటిషన్‌ను తిరసర్కించిన కోర్టు

బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు వేసిన రీ కాల్ పిటిషన్ ను మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు తిరసర్కించింది. నోటీసులు అందుకున్న వారంతా అక్టోబర్ 15న కోర్టుకు రావాలని ఆదేశించింది. మరోవైపు ఇవాళ కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేసింది.

తెలంగాణను ఎడారి చేసేలా మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్ట్ లు నిర్మించిందని గంగుల కమలాకర్ ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్ట్ తో ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ చుక్కనీరు రాదన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ భూభాగంలోనే ఆందోళన చేశామని వివరించారు. సమన్లు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని గంగుల కమలాకర్ తెలిపారు.

బాబ్లీ కేసు ఇప్పటిది కాదు. 2010లో బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని చంద్రబాబుతో పాటు మరి కొందరు టీడీపీ నేతలు ఆందోళన చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, 144 సెక్షన్ ను ఉల్లంఘించారని చంద్రబాబు సహా 16 మందికి 8 ఏళ్ల తర్వాత వారెంట్లు జారీ అయ్యాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు విస్తృతంగా చర్చించారు. న్యాయ వ్యవస్థను గౌరవించి కోర్టుకు వెళ్దామని ఆయన తొలుత భావించారు. అయితే తొలిసారే నోటీసులు వచ్చాయి కనుక న్యాయవాదులను పంపిస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. రీకాల్‌ పిటిషన్‌ వేస్తే కోర్టుకు వెళ్లే పని ఉండకపోవచ్చన్నారు. ఆ తర్వాత న్యాయ సలహాలు తీసుకున్న చంద్రబాబు రీకాల్‌ పిటిషన్‌ వైపే మొగ్గు చూసి. లాయర్ల బృందాన్ని పంపారు. ఇవాళ వారు రీకాల్ పిటిషన్ వేశారు. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు రద్దు చేయాలని కోరారు. రీకాల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఆ రోజున నోటీసులు అందుకున్న వారంతా కోర్టుకు రావాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com