డాక్టరేట్‌ అందుకున్న సోనూసూద్‌

- September 26, 2018 , by Maagulf
డాక్టరేట్‌ అందుకున్న సోనూసూద్‌

దిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్‌ తైక్వాండోలో డాక్టరేట్‌ అందుకున్నారు. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో జరిగిన 107 అంతర్జాతీయ క్యోరుగి రెఫరీ సెమినార్‌కు సోనూ సూద్‌ వెళ్లారు. ఈ సందర్భంగా తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ ప్రభాత్‌ శర్మ సోనూకు డాక్టరేట్‌ను అందించారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌ మీడియాతో మాట్లాడుతూ..'చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు నేను తైక్వాండో శిక్షణకు వెళ్లిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ తైక్వాండోలో నాకు డాక్టరేట్‌ వస్తుందని ఊహించలేదు. ఇదంతా నేను ఎంపికచేసుకున్న యాక్షన్‌ సినిమాల వల్లే సాధ్యమైంది. ఎన్నో ఏళ్లుగా యాక్షన్‌ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. ఇప్పటికీ అవే సినిమాలు చేస్తున్నాను. చిన్నప్పుడు తొలిసారి మా అమ్మ నాకోసం తైక్వాండో దుస్తులు కొనిచ్చి శిక్షణా తరగతులకు తీసుకెళ్లిన రోజులు గుర్తున్నాయి. ఈరోజు అమ్మ ఉండుంటే బాగుండు. నాకు డాక్టరేట్‌ రావడం చూసి ఎంతో సంతోషించేది. నాపై ఉన్న అమ్మ ఆశీర్వాదాలే మ్యాజిక్‌ చేసి నాకు డాక్టరేట్‌ వచ్చేలా చేశాయని అనిపిస్తోంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది' అని వెల్లడించారు సోనూ.

'పల్టాన్‌' అనే హిందీ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు సోనూ. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సి' సినిమాలో సోనూ సదాశివ్‌ అనే మరాఠా వీరుడి పాత్రలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో సోనూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు బయోపిక్‌లో సోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయన బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌, సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సోనూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com