బెంగళూరు విమానాశ్రయంలో నూతన సాంకేతికత అమలు

- September 27, 2018 , by Maagulf
బెంగళూరు విమానాశ్రయంలో నూతన సాంకేతికత అమలు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(బీఐఏఎల్‌) అతి త్వరలో బయోమెట్రిక్‌ టెక్నాలజీని సమకూర్చుకోనుంది. ప్రయాణికులను సమగ్రంగా పర్యవేక్షించే ముఖ కవళికల గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) విధానంతో ఈ బయోమెట్రిక్‌ సాంకేతికతను త్వరలో అమలు చేయనున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ ఏషియా, స్పైస్‌ జెట్‌ల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణికులకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. లిస్బన్‌ ఆధారిత డిజిటల్‌, బయోమెట్రిక్‌ సొల్యూషన్‌ సంస్థ అందించే సాంకేతికతతో ఈ విధాన అమలుకు ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్‌ బోర్డింగ్‌ టెక్నాలజీతో ప్రయాణికులను సునిశితంగా పర్యవేక్షించదగిన ఈ విధానాన్ని అమలు చేసిన తొలి విమానాశ్రయం బీఐఏఎల్‌ కానుందని సంస్థ ఎం.డి. హరిమరార్‌ చెప్పారు. విమానాశ్రయం పరిసరాల్లో అనవసరంగా తిరిగే వారితో పాటు బోర్డింగ్‌ పాసుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానం ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్‌ యాత్ర ప్రాజెక్టు నిధులు కూడా ఈ సరికొత్త విధానానికి ఉపయోగించే వీలుందన్న ఆయన రానున్న జనవరిలోపు బయోమెట్రిక్‌ను అమలు చేయనుండగా ఈ విధానంతో ప్రయాణికుల సరకుల పరిశీలన కూడా వేగవంతం కానుందన్నారు. బయోమెట్రిక్‌తో పాటు కాగితరహిత విమానాశ్రయంగా కూడా బీఐఏఎల్‌ రూపుదిద్దుకోనుందని హరిమరార్‌ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఆధునికతలకు ఇది నిలయంగా మారుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com