మొబైల్‌ నంబర్లు డిస్కనెక్ట్‌ చేయడం లేదు : ఉడాయ్‌, టెలికాం శాఖ

- October 18, 2018 , by Maagulf
మొబైల్‌ నంబర్లు డిస్కనెక్ట్‌ చేయడం లేదు : ఉడాయ్‌, టెలికాం శాఖ

ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న ఏ మొబైల్‌ నంబర్‌ను డిస్కనెక్ట్‌ చేయడం లేదని కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) సంయుక్తంగా తెలియజేశాయి. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఆధార్‌తో లింక్‌ చేసుకున్న 50కోట్ల మొబైల్‌ నంబర్ల కనెక్షన్‌ను నిలిపివేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే అటువంటి చర్యలేవీ తీసుకోవడం లేదని స్పష్టం చేస్తూ ఉడాయ్‌ ప్రకటనను విడుదల చేసింది.

'కొత్తగా తీసుకునే సిమ్‌ కార్డులకు ఆధార్‌ ఈ-కేవైసీ ప్రాసెస్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాని.. ఆధార్‌ లింక్‌ చేసుకున్న పాత మొబైల్‌ నంబర్లను డీయాక్టివేట్‌ చేయడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాత వినియోగదారులు ఆధార్‌ను డీ లింక్‌ చేసుకోవాలంటే ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఇతర కార్డుల వివరాలతో కొత్తగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఒక ఆప్షన్‌ మాత్రమే.. తప్పనిసరి కాదు. ఎట్టిపరిస్థితుల్లోను మొబైల్‌ నంబర్లను డిస్కనెక్ట్‌ చేయడం లేదు' అని టెలికం శాఖ, ఉడాయ్‌ తన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఆధార్‌ డీ లింక్‌ చేసే ప్రణాళికను పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఉడాయ్‌ టెలికాం సంస్థలను కోరింది. ఆధార్‌ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపివేయాలని తెలిపింది. ఆధార్‌ డీ లింక్‌ చేసే ప్రణాళికలను అక్టోబరు 15వ తేదీ నాటికి అందజేయాలని ఉడాయ్‌ నోటీసుల్లో పేర్కొంది. మొబైల్‌ నంబర్‌తో ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్‌ అడ్మిషన్లకు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థలు సహా ప్రైవేటు కంపెనీలు ఆధార్‌ నంబరు అడగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com