సౌదీతో తెగతెంపులపై 'నో' అంటున్న పశ్చిమ దేశాలు
- October 23, 2018
రియాద్: జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య విషయంలో సౌదీ అరేబియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు మాత్రం ఆ దేశంతో తెగతెంపులు చేసుకునే విషయంలో విముఖత ప్రదర్శిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్కు చెందిన కాలమిస్టు ఖసోగి ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సలేట్ను ఈ నెల 2న సందర్శించిన తరువాత అదృశ్యమయ్యాడు. ఆయనను సౌదీ అరేబియా హత్య చేసిందని టర్కీ ఆరోపిస్తుండగా సౌదీ అధికారులు దాదాపు రెండు వారాల పాటు వీటిని తోసిపుచ్చారు. ఎట్టకేలకు ఖషోగ్గీ తమ దౌత్య కార్యాలయంలోనే హత్యకు గురైన విషయాన్ని వారు అంగీకరించారు.
సౌదీ విదేశాంగ మంత్రి అదల్ అల్ జుబెయిర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఖషోగ్గీ హత్య తమ దేశం చేసిన ఘోర తప్పిదమని అన్నారు. ఇందులో యువరాజు సల్మాన్ ప్రమేయం గురించి తనకు తెలియదని ఆయన చెప్పారు. ఈ హత్యను పశ్చిమ దేశాలలో ప్రధానమైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఖండించినప్పటికీ, చమురు సంపద పుష్కలంగా వున్న సౌదీతో తెగతెంపులు చేసుకునే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో వున్నందున ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ న్యూచిన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో సౌదీ వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
అయితే ఖషోగ్గీ హత్య వెనుక వాస్తవాలను వెలికి తీయాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ డిమాండ్ చేస్తున్నప్పటికీ సౌదీతో సంబంధాల విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే జర్మనీ మాత్రం ఈ వివాదం నేపథ్యంలో సౌదీకి ఆయుధ విక్రయాలను రద్దు చేసింది. సౌదీతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవటానికి తాము సిద్ధంగా లేమని బ్రిటన్కు చెందిన బ్రెగ్జిట్ వ్యవహారాల మంత్రి డొమ్నిక్ రాబ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!







