తెలంగాణ ఎన్నికలు : కౌంటింగ్ కేంద్రాల వివరాలు

- December 09, 2018 , by Maagulf
తెలంగాణ ఎన్నికలు : కౌంటింగ్ కేంద్రాల వివరాలు

పోలింగ్‌ పూర్తైంది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు చేరిపోయాయి. ఇక ఫలితాలే ఆలస్యం. డిసెంబర్‌ 11న జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు.మరీ కౌంటింగ్‌ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏజిల్లాలో ఎక్కడెక్కడ కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఒక కౌంటింగ్‌ కేంద్రంలో ఎన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది? ఫలితాన్ని తేల్చేందుకు ఒక్క నియోజకవర్గంకు సంబంధించి ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను టీవీ5 మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది.

ముందుగా ఉత్తర తెలంగాణలోని కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు వెళ్దాం. ఆసిఫాబాద్‌ పట్టణంలోని సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక మంచిర్యాలలోని ఏఎంసీ గోదాంలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఓట్ల లెక్కింపు జరగనుంది.

అటు ఆదిలాబాద్‌లోని టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక నిర్మల్‌కు వస్తే… పట్టణంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. మూడు నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి పాలిటెక్నిక్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కామారెడ్డి విషయానికి వస్తే….ఇక్కడ ఏఎంసి గోదాంలో ఎన్నికల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుంది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ కూడా మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.

పెద్దపల్లి జిల్లాలోని మంథని జేఎన్‌టీయూహెచ్‌లో అధికారులు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఈ కాలేజీలో జరగనుంది.

ఇక సిరిసిల్ల జిల్లాలో.. తంగళ్లపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంగారెడ్డిలో గీతం యూనివర్సిటీలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

అటు మెదక్‌లోని వైపీఆర్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌లో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఇక్కడ రెండు నియోజర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

సిద్దిపేటలోని ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓట్ల లెక్కింపు వేదిక కానుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో మొత్తం నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాలమూకులలోని బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షిల్‌ డిగ్రీ కాలేజీలో మరో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

వికారాబాద్‌లోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ గోదాంలో కౌంటింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

మేడ్చల్ జిల్లా కీసరలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక హైదరాబాద్‌ విషయానికి వస్తే.. ఇక్కడ పెద్ద సంఖ్యలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 13 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఎల్బీ స్టేడియం, అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నారాయణగూడలోని రెడ్డి కాలేజీ, యూసుఫ్‌ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, తార్నాకలోని ఓయూ కామర్స్ బిల్డింగ్, మాసాబ్‌ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గోషామహాల్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం, నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ, నాంపల్లిలోని సరోజిని నాయుడు కాలేజీ, మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్య భవన్, ఓయూలోని పీజీఆర్‌ఆర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, కంటోన్మెంట్‌లోని సీఎస్‌ఐఐటీ వెస్లీ కాలేజ్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్‌ కేంద్రాల్లో హైదరాబాద్‌ పరిధిలోని మొత్తం15 నియోజర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలోని జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంతో పాటు అదే కాలేజీలోని అబ్దుల్‌ కలాం బిల్డింగ్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఐదు నియోజవకర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

నాగర్ కర్నూల్‌ జిల్లా నెల్లికొండలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ మూడు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

వనపర్తిలోని న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వనపర్తి ఒక్క నియోజకవర్గంకు సంబంధించే ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక జోగులంబా గద్వాల జిల్లాలో గద్వాలలోని ఎస్‌కేటీఆర్‌ కాలేజీ ఓల్డ్ బిల్డింగ్‌లో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

అటు నల్గొండలోని దుప్పల్లాపల్లి tsహౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

సూర్యాపేటలో ఏఎంసీ గోదాంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

యాదాద్రి జిల్లా భువనగరిలోని అరోరా ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

జనగామలోని పెంబర్తి వీబీఐటీలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

మహబూబాబాద్‌లోని ఫాతిమా హైస్కూల్‌లో కౌంటిగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

వరంగల్-రూరల్‌ జిల్లాకు వస్తే…నగరంలోని ఏనుమాముల ఏఎంసీ మార్కెట్‌ యార్డులో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే వరంగల్ అర్బన్‌ జిల్లాకు సంబంధించి కూడా ఎనుమాములలోని ఎంఎల్‌ఎస్‌ గోదాంలో మరో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

భూపాలపల్లి అంబేడ్కర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు నియోజర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇనుబోసు ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ మొత్తం ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com