షాంఘై సదస్సులో మోదీ ప్రవేశపెట్టిన 'హెల్త్‌' మంత్ర

- June 14, 2019 , by Maagulf
షాంఘై సదస్సులో మోదీ ప్రవేశపెట్టిన 'హెల్త్‌' మంత్ర

ఉగ్రవాదంపై పాక్‌కు పరోక్ష హెచ్చరికలు
ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దాయాది దేశం పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎదుటే పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దాన్ని అరికట్టాలని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీవో దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని కోరారు. ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

ఎస్‌సీవోలో భారత్‌ రెండేళ్లుగా శాశ్వత సభ్యదేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సీవో చేపట్టే అన్ని కార్యక్రమాలకు సానుకూల సహకారం అందించామని మోదీ తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఎస్‌సీవో విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రదాడిని గురించి కూడా మోదీ ప్రస్తావించారు. 'అక్షరాస్యత, సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో సానుకూల దృక్పథాన్న పెంచుతాయి. యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని మోదీ అన్నారు.

'హెల్త్‌' మంత్రాన్ని పాటిద్దాం..
ఈ సందర్భంగా ఎస్‌సీవో సభ్య దేశాలకు మోదీ హెల్త్‌ మంత్రాన్ని చెప్పారు. HEALTHలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉందని వివరించారు. ''H అంటే హెల్త్‌ అండ్‌ మెడికేర్‌(ఆరోగ్య సహకారం), E అంటే ఎకో(పర్యావరణ సహకారం), A అంటే ఆల్టర్నేట్‌ కనెక్టివిటీ(సముద్రమార్గం ద్వారా ప్రత్నామ్నాయ అనుసంధానం), L అంటే లిటరేచర్‌(అక్షరాస్యతపై అవగాహన), T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ(ఉగ్రవాద రహిత సమాజం), H అంటే హ్యుమానిటీ(మానవత్వ సహకారం)'' అని మోదీ చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు పరస్పరం హెల్త్‌ సహకారం అందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com