ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం, 30మంది మృతి

- June 21, 2019 , by Maagulf
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం, 30మంది మృతి

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్గిపుల్లల కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. నార్త్‌ సుమత్రా ప్రావిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 30 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత భారీగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకొని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలను అంతగా పట్టించుకోని ఇండోనేషియాలో అగ్నిప్రమాదాలు కొత్తేమీ కాదు. 2017లో జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 47 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com