పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

- December 04, 2019 , by Maagulf
పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన 'పౌరసత్వ సవరణ బిల్లు'కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. అయితే, ఈ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్‌లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడగింపు..
పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పొడగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2020 జనవరి 25 గడువు ముగియనుంది. అయితే, దీన్ని మరో 10 ఏళ్ల పాటు పొడగించేందుకు మంత్రివర్గం నిర్ణయించినట్లు అత్యంత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. రిజర్వేషన్ల పొడగింపుపై తాజా పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com