300 పౌరుల తలలు కోసి వీధుల్లో పడేశారు!

- January 17, 2016 , by Maagulf
300 పౌరుల తలలు కోసి వీధుల్లో పడేశారు!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరింతగా పెట్రేగిపోయారు. తాజాగా సిరియాలో రక్తపుటేరులు పారించారు. 300 మంది పౌరుల తలలు తెగ్గోసి.. వీధుల్లో పడేశారు. దీంతో సిరియాలోని దేరెల్ - ఇజార్ వీధులు శవాల గుట్టలుగా మారిపోయాయి. సిరియాలోని భూభాగాలపై పట్టుకోసమే ఈ నెత్తుటేరులు పారించారు. అంతేనా.. మరో 400 మంది సున్నీ తెగకు చెందిన ప్రజలను బందీలుగా చేసుకున్నారు. సిరియాలోని తూర్పుమధ్య నగరం దేరెల్‌-ఇజార్‌లో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక్కరోజే 300 మందికి పైగా పౌరులను ఊచకోత కోశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులుసహా కనిపించినవారినల్లా కత్తికి బలిపెట్టారు. బందీల తలలు నరికి నదిలోకి విసిరేశారు. ఉగ్రవాదుల నుంచి పట్టణాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన సైనికులను దారుణంగా వధించారు. ఎదురొడ్డిన వారి గుండెలపై గుండ్లవర్షం కురిపించారు. మరో 400 మంది పౌరులను బందీలుగా పట్టుకొన్నారు. దేరెల్‌-ఇజార్ ప్రాంతం ఉగ్రవాదుల పరంకాకుండా సిరియా సైన్యంతో పాటు మిలీషియా, పౌరులు సాయుధులై ఉగ్రవాదులతో తలపడ్డారు. దీంతో నగరంలోని ప్రతి వీధిలో భీకర పోరు దృశ్యాలు కనిపించాయి. ఊహించని ప్రతిఘటనతో ఉగ్రవాదులు తొలుత తత్తరపడ్డారు. ఆ వెంటనే ఉన్మాదులుగా మారి నేరుగా పౌరులపైకి రోజంతా విచ్చలవిడిగా కాల్పులు సాగించి నరమేధం సాగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com