ఎడారి నుండి స్వదేశం చేరిన వలసజీవి

- February 18, 2020 , by Maagulf
ఎడారి నుండి స్వదేశం చేరిన వలసజీవి

తెలంగాణ:నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన షేక్ వసీం ఉపాధికోసం జులై 2018 లో కువైట్ కు వెళ్ళాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ పట్టా పొందిన వసీం స్వదేశంలో ఉపాధిలేక కువైట్లో మెకానికల్ హెల్పర్, స్టోర్ కీపర్ గా 110 కువైట్ దినార్లు(రూ. 26 వేలు) జీతానికి పనిచేశాడు. 

కంపెనీ యాజమాన్యం ముందుగా ఒక సంవత్సరం వీసా స్టాంపింగ్ చేయించి, సివిల్ ఐడి ఇప్పించింది. సంవత్సరం తర్వాత కేవలం మూడు నెలల కోసం తాత్కాలిక వీసా ఇచ్చారు. అది కూడా డిసెంబర్ 2019 లో గడువు  ముగిసింది. గత నాలు నెలలుగా జీతం ఇవ్వని కంపెనీ వసీం తోపాటు మరో ముప్పయి మంది కార్మికులను ఇండియాకు పంపింది. 

గల్ఫ్ కార్మికుడికి ఆత్మీయ స్వాగతం
  
సోమవారం (17.02.2020) ఉదయం కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్  పోర్టుకు చేరుకున్న వసీం కు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి విజ్ఞప్తిమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం పక్షాన  ఎయిర్  పోర్టు ప్రోటోకాల్ సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికి దారి ఖర్చులకు గాను ఒక వెయ్యి రూపాయలు అందించారు.  

గల్ఫ్ దేశాల నుండి భారత్ కు వాపస్ వచ్చిన కార్మికుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన  పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దీకొండ కిరణ్ కోరారు. ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు తమ హెల్ప్ లైన్ నెంబర్ +91 94947 60477 లేదా ఢిల్లీలోని ప్రవాసి భారతీయ సహాయతా కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయాలని ఆయన కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com