మనస్సాక్షి

- May 21, 2015 , by Maagulf
మనస్సాక్షి

ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం ఎక్కడో పడిపోయింది. కోట మొత్తం వెతికించినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బీర్బల్ ని దర్బారుకు పిలిపించి 'నా ఉంగరం కనిపించడంలేదు. సేవకులు కోటంతా వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మన సభలోని వాళ్ళే ఎవరో దొంగాలించారని నా అనుమానం. ఎవరు దొంగాలించారో కనిపెట్టగలవా?' అని అడిగాడు. బీర్బల్ ఒక్క నిమిషంపాటు ఆలోచించి 'ఇది చాలా సులువైన పని మహారాజా, ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అతడి గడ్డంలో ఒక బియ్యపుగింజ ఉంటుంది. దాన్నిబట్టి ఎవరు దొంగతనం చేశారో తేలిపోతుంది. అందరి గడ్డాలూ ఒక్కసారి పరిశీలించి అసలైన దొంగను కనిపెట్టేస్తాను' అన్నాడు. ఆ మాటలు వింటూనే సభలోని ఒక వ్యక్తి భయంభయంగా తన గడ్డం తడుముకున్నాడు. అది చూసిన బీర్బల్ వెంటనే అతడిని పట్టించాడు. 'దొంగ గడ్డంలో బియ్యపుగింజ ఉందన్న విషయం నీకెలా తెలుసు?' అంటూ అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. 'గడ్డంలో బియ్యపుగింజ ఎలా ఉంటుంది మహారాజా, తప్పు చేసిన వ్యక్తిని మనస్సాక్షి ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పు చేయనివాళ్ళు దొంగతనం చేసింది ఎవరా అని అటూఇటూ ఆసక్తిగా చూస్తుంటే తప్పుచేసిన వ్యక్తి భయంతో గడ్డం తడుముకున్నాడు' అంటూ అసలు సంగతి వివరించాడు. అలా తన తెలివితేటలను, సమయస్ఫూర్తితో దొంగను పట్టించడమే కాకుండా రాజు గారి ప్రశంసలూ అందుకున్నాడు బీర్బల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com