భారత్‌:ఒక్క రోజులో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- September 25, 2020 , by Maagulf
భారత్‌:ఒక్క రోజులో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని టెస్టులు చేయడం ఇదే తొలిసారి. నిన్న చేసిన పరీక్షల్లో 86,052 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో శుక్రవారం నాటికి నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,18,570కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో నిన్న 81 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 47 లక్షల 56 వేలకు చేరింది. మరో 9 లక్షల 70 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, మరోపక్క కరోనా సోకి మరణిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. రోజుకి దాదాపు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న ఒక్కరోజే 1141 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 92,290కి చేరింది. అయితే వైరస్ సోకి మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81 శాతం కాగా, మరణాల రేటు 1.59 శాతంగా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com