కరోనా టీకా వేయించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

- March 02, 2021 , by Maagulf
కరోనా టీకా వేయించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

విజయవాడ:ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు.ఆసుపత్రి సిస్టర్ ఝాన్సీ వీరికి టీకా ఇవ్వగా, సూపరిండెంట్ డాక్టర్ కె.శివశంకర్ పర్యవేక్షించారు.టీకా కార్యక్రమం ముగిసిన తరువాత గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకోవటం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైనదని వివరించారు. టీకాను త్వరితగతిన కనుగొనటం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారన్నారు. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో వైద్యులు చేసిన కృషి అజరామరమని, వారి సేవలు మరువలేనివని బిశ్వభూషణ్ కొనియాడారు. తాను కోవాక్సిన్ టీకా తీసుకున్నానని ప్రత్యేకించి ఇంజక్షన్ తీసుకున్నట్టే అనిపించ లేదని వివరించారు. రెండో డోసు టీకాను మార్చ్ 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్, సంయిక్త పాలనాధికారి శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జ్ఞానచంద్ర, ఎన్.టి.ఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎనస్దీషియన్ డాక్టర్ శివరాం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుహాసిని,  వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ (ఇమ్యునైజేషన్) డాక్టర్ యు.శ్రీహరి, గవర్నర్ వారి వ్యక్తిగత వైద్య బృందం సభ్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com