మహారాష్ట్రలో కోవిడ్‌ రెండో దశ

- March 16, 2021 , by Maagulf
మహారాష్ట్రలో కోవిడ్‌ రెండో దశ

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కోవిడ్‌ రెండో దశ ప్రారంభమై కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం... కోవిడ్‌ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా కేసుల్ని గుర్తించడం, పరీక్షలు చేయడం వంటివి చేయాలని ఆ లేఖలో సూచించింది. ఆ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోవిడ్‌ క్రియాశీల కేసుల్ని గుర్తించడం, పరీక్షించడం, వేరుచేయడం, ట్రాక్‌ చేయడం వంటి చర్యలు చాలా పరిమితంగానే జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. అలాగే ఔరంగబాద్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, నాసిక్‌లోని వసంత్‌ రావ్‌ పవార్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. మరణించిన వారి నమూనాలను, వారి గత ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గతవారం కేంద్ర బృందం పర్యటించింది. ముంబైలో 5.1 శాతం నుండి 30 శాతం వరకు పాజిటివ్‌ కేసులున్నట్లు కేంద్ర బృందం నివేదించింది. ఇంకా పరీక్షించబడని అనేక కేసులున్నాయని కూడా తెలిపింది.
ఇప్పటికే ఔరంగాబాద్‌, నాసిక్‌, జల్గాన్‌ వంటి కొన్ని జిల్లాలు రాత్రిపూట కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కరోనాపై పరిమిత ప్రభావమే చూపవచ్చని రాజేష్‌ తెలిపారు. అందుకే జిల్లా యంత్రాంగం నియంత్రణా చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 15,000లకు పైగా కొత్త కోవిడ్‌ కేసులు నయోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 23,29,464కు చేరింది. 48 మంది మృత్యువాతపడ్డారు.

కాగా, కోవిడ్‌ నియంత్రణా చర్యల్లో భాగంగా.. మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లలోనూ, వివాహ, అంత్యక్రియల కార్యక్రమాల్లోనూ పరిమిత సంఖ్యకే అనుమతించింది. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కే ప్రాధాన్యతనివ్వాలని సలహా ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com