భారత వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' సామర్ధ్యాన్ని మెచ్చుకున్న ఫౌచీ

- April 28, 2021 , by Maagulf
భారత వ్యాక్సిన్ \'కొవాగ్జిన్\' సామర్ధ్యాన్ని మెచ్చుకున్న ఫౌచీ

వాషింగ్టన్‌: ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ అసమానతలకు నిదర్శనమని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెండు లక్షల మార్కును దాటిన క్రమంలో.. ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

617 కరోనా రకాన్ని నిలువరిస్తున్న కొవాగ్జిన్..
దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 617 కొవిడ్ రకాన్ని నిలువరించగలదని గుర్తించినట్లు ఫౌచీ వెల్లడించారు. భారత్‌లో వినియోగిస్తోన్న ఈ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఓ సమావేశంలో భాగంగా చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ..వ్యాక్సినేషన్ ప్రధానమైన విరుగుడని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా..ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు 'భారత్ రకం' కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఈ టీకాలు పొందిన వారిలో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ సోకినా స్వల్ప అనారోగ్యమే తలెత్తవచ్చని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌పై సీసీఎంబీ నిర్వహించిన మరో అధ్యయనంలోనూ ఇవే సానుకూల ఫలితాలు వచ్చాయి. కరోనాలో కొత్తగా వచ్చిన బి.1.617 రకాన్ని 'జంట ఉత్పరివర్తనల' వైరస్ లేదా 'భారత్‌ రకం'గా పిలుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com